ఎర్రచందనం: వలీతో సహజీవనం చేస్తున్న నటి నీతు అగర్వాల్ అరెస్ట్
హైదరాబాద్: ఎర్ర చందనం కేసులో సినీ నటి నీతూ అగర్వాల్ను కర్నూలు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను శనివారం రాత్రి హైదరాబాదు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆదివార ఉదయం ఆమెను మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు.
కర్నూలు జిల్లా చాగలమర్రి ఎంపీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మస్తాన్ వలీతో ఆమె సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. అతనిని నీతు మూడో పెళ్లి చేసుకున్నట్లుగా కూడా ఊహాగానాలు వినిపించాయి. ఎర్ర చందనం అక్రమ రవాణాలో మస్తాన్ వలీకి ఈమె సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. 13వ తేదీ నుండి నీతు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కాగా, సినీనటి నీతూ అగర్వాల్ను తాను పెండ్లి చేసుకున్నానని, హైదరాబాద్లో తాము కాపురం చేస్తున్నామని ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో అరస్టైన నిందితుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత మస్తాన్వలీ తెలిపిన విషయం తెలిసిందే. అనంతపురం వన్టౌన్లో నమోదైన ఓ కేసు విచారణ నిమిత్తం శుక్రవారం జిల్లాకు వచ్చిన మస్తాన్ వలీ కొంత మంది మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తాను గతంలో కమిషన్ కోసం ఎర్రచందనం అక్రమంగా రవాణా చేశానని, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాటన్నింటికి దూరంగా ఉంటున్నానని వివరించారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే కొందరు కుట్ర పన్ని కేసుల్లో ఇరికించారని ఆరోపించారు. ప్రేమ ప్రయాణం సినిమా నిర్మాణం సమయంలో హీరోయిన్ నీతూతో పరిచయం ఏర్పడిందన్నారు.
నీతూకి ఎర్రచందనం స్మగ్లింగ్తో ఎలాంటి సంబంధం లేదని, తనతో సన్నిహితంగా ఉంటున్న కారణంగానే ఆమెపై కొందరు పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ వ్యవహారంలో సినీనటి నీతూ అగర్వాల్పై కేసు నమోదు చేశామని కర్నూలు ఎస్పీ ఏ రవికృష్ణ తెలిపారు. ఆమెను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
మస్తాన్ వలీని అనంతపురం పోలీసులు ఒక బొలెరో వాహనం దొంగతనం కేసులో ప్రిజినర్స్ ట్రాన్సిట్ వారెంట్ కింద అనంతపురం కోర్టులో హాజరు పరిచారు. కోర్టు నాలుగు రోజులు పోలీసుల కస్టడీకి ఇచ్చింది. దీంతో మస్తాన్ వలీని ఒన్టౌన్ పోలీసు స్టేషన్కు తీసుకు వచ్చారు.
తాను ప్రేమ ప్రయాణం పేరుతో రూ.1.2 కోట్లతో సినిమా తీశానన్నారు. తానూ, నీతూ కలసి తలా 15 లక్షల రూపాయలు పెట్టి రూ.30 లక్షలతో హైదరాబాద్లో అపార్ట్మెంటు కొన్నామన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తమ పార్టీ అధినేత జగన్ను కలుస్తానని తెలిపారు.