బిజెపితో పొత్తుపై బాబు చర్చ, టిపై అదే వైఖరన్న బిజెపి
దీంతో అధినేత.. టిడిపి, బిజెపిలు పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందో మీరే చెప్పండని అడిగారట. బిజెపితో ప్రమాదం లేదు కానీ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారంటే మైనారిటీల్లో వ్యతిరేకత ఉందని అన్నట్టు తెలిసింది. టిడిపి సెక్యులరిజానికి కట్టుబడి ఉందని, బిజెపితో మనం పొత్తుపెట్టుకున్నా, ఆ పార్టీని అదుపులో ఉంచవచ్చునని బాబు అభిప్రాయం వ్యక్తం చేశారట.
తెలంగాణకు కట్టుబడ్డాం... మారేది లేదు: బిజెపి
మరోవైపు తెలంగాణపై తీసుకున్న విధాన నిర్ణయాన్ని ఏది ఏమైనా తమ పార్టీ మార్చుకోబోదని బిజెపి అగ్రనేత అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తమ పార్టీ నాయకులను కలిసినంత మాత్రాన తెలంగాణ విషయంలో తాము వైఖరిని మార్చుకుంటున్నట్లు కాదన్నారు.
మంగళవారం ఢిల్లీ పార్టీ కార్యాలయంలో భారతీయ యువమోర్చా జాతీయ మీడియా వర్క్షాప్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, మోడీలు ఒకే వేదికను పంచుకోవటం యాదృచ్ఛికమని బిజెపి అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇదే కార్యక్రమంలో కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నాయకులు కూడా పాల్గొంటున్నారని ఆమె వివరించారు.
ఆంధ్రప్రదేశ్లో పొత్తుల గురించి స్పందిస్తూ తాము టిడిపితో కానీ, వైయస్సార్ కాంగ్రెసుతో కానీ ఇంత వరకూ ఎలాంటి చర్చలు జరపలేదని, అయితే పొత్తులు పెట్టుకోవటం పట్ల ఆసక్తిగా ఉన్నామని వివరించారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ కూడా ఇదే విషయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయాలా లేదంటే జగన్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోల్కాతాలో ఆయన వివరించారు.