టెర్రర్ టెన్షన్ : ఆగస్ట్ 15 టార్గెట్ గా భారీ పేలుళ్లకు ప్లాన్ ; కాన్పూరులోనూ స్లీపర్ సెల్స్ టెన్షన్ !!
భారతదేశానికి ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందా? పుల్వామా ఉగ్రదాడి తరువాత ఉగ్రవాద కార్యాకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్న భారత ఆర్మీకి కళ్ళు బైర్లు గమ్మే విషయాలు కనిపిస్తున్నాయా ? దేశంలో పలు ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఉగ్రవాద స్లీపర్ సెల్స్ చాప క్రింద నీరులా విస్తరిస్తున్నారా ? భారత్ లో కల్లోలం సృష్టించటానికి రోజుకో రకంగా ప్రయత్నాలు సాగిస్తున్నారా ? పలు రాష్ట్రాల్లో జరుగుతున్న యెన్ఐఏ, ఏటీఎస్ సోదాలు, పోలీసు ఉన్నతాధికారుల వ్యాఖ్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.
పుల్వామా ఉగ్ర దాడిలో కీలకంగా ఉన్న జైషే చీఫ్ బంధువు, ఉగ్రవాది హతం .. జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్
భారత్ కు ఉగ్ర సవాళ్ళను ఎదుర్కోవటం పెద్ద సవాల్
భారతదేశ ప్రభుత్వానికి ఉగ్ర సవాళ్ళను ఎదుర్కోవటం పెద్ద సవాల్ గా మారింది. తాజా పరిణామాలతో బోర్డర్ లో భారత సైన్యం నిత్యం పోరాటం చేస్తుంది. పుల్వామా ఉగ్రదాడి తరువాత నుండి ఇప్పటి వరకూ భారతదేశంలోని ఉగ్రమూక చొరబడడానికి చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. ఒకపక్క సరిహద్దుల వద్ద రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా పహారా కాయటమే కాకుండా, ఉగ్రవాద చొరబాట్ల కట్టడికి నిత్య సమరం చేస్తుంది. అయినా నిత్యం ఏదో ఒక రకంగా భారత్ లో విధ్వంసం సృష్టించే యత్నం చేస్తూనే ఉన్నారు ఉగ్రవాదులు . ఐఎస్ఐ ఒకవైపు, లష్కర్ ఏ తోయిబా మరో వైపు, ఆల్ఖైదా ఇంకో వైపు, తాలిబన్లు, జైషే మహమ్మాద్ మరోవైపు దాడులకు తెగబడుతున్నారు. ఇక దేశంలో అనేక రాష్ట్రాలలో స్లీపర్ సెల్స్ ఉగ్రవాద కార్యాకలపాలను ఉగ్ర సంస్థలు నిర్వహిస్తున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.
కాన్పూర్లో టెర్రర్ మాడ్యూల్స్ మరియు స్లీపర్ సెల్స్ పై డీజీపీ సంచలనం
మొన్నటికి మొన్న తెలంగాణా రాజధాని హైదరాబాద్ లో ఎన్ఐఏ శోధనలలో అనేక మంది స్లీపర్ సెల్స్ హైదరబాద్ కేంద్రంగా ఉగ్రవాద కార్యాకలాపాలకు సైలెంట్ గా పని చేస్తున్నారని గుర్తించారు. అనేకమంది అనుమానితులను అరెస్ట్ చేశారు. ఇక తాజాగా యూపీలోనూ ఉగ్రవాద స్లీపర్ సెల్స్ ఆందోళన కలిగిస్తున్నారు. కాన్పూర్లో టెర్రర్ మాడ్యూల్స్ మరియు స్లీపర్ సెల్స్ పనిచేసే అవకాశాన్ని నిరాకరించలేమని ఉత్తరప్రదేశ్ పోలీసు చీఫ్ ముకుల్ గోయల్ ఆదివారం చెప్పారు. దీంతో మరోమారు అనేక రాష్ట్రాల్లో ఉగ్ర ముప్పుపై ఆందోళన నెలకొంది. రాష్ట్రంలోని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటిఎస్) మరియు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఉగ్రవాద స్లీపర్ సెల్స్ పై అదనపు నిఘా ఉంచాలని నిర్ణయించాయని ఆయన చెప్పారు.
యూపీలోనూ ఉగ్రవాదుల అరెస్ట్ .. ఆగస్టు 15 దాడులకు కుట్ర భగ్నం
ఉగ్రవాదుల కార్యకలాపాలపై అనుమానంతో లక్నోలో ఇటీవల కొంతమంది వ్యక్తులను ATS అరెస్టు చేసిన నేపథ్యంలో తాజాగా డీజీపీ గోయల్ ఈ ప్రకటన చేశారు .లక్నోలో అరెస్టులు కాన్పూర్లో కూడా నిఘా పెంచడానికి పోలీసులను ప్రేరేపించాయని ఆయన అన్నారు. మాకు టెర్రర్ మాడ్యూల్స్ గురించి నిర్దిష్ట మేధస్సు ఇన్పుట్లు లేవు, కానీ నగరంలో (కాన్పూర్) టెర్రర్ మాడ్యూల్స్ మరియు స్లీపర్ సెల్స్ ఉండే అవకాశాన్ని మేము తిరస్కరించలేమని గోయల్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లో ఆల్ ఖైదా మద్దతు ఉన్న అన్సార్ గజ్వేల్ హింద్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను గతనెలలో లక్నో శివార్లలో అరెస్ట్ చేశారు. ఇక వారి వద్ద నుండి భారీగా పేలుడు పదార్థాలు సేకరించటంతో పాటుగా , ఉగ్రవాదులు అనేకచోట్ల పేలుళ్లకు ప్లాన్ చేశారని గుర్తించారు. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలు నగరాల్లో ఉగ్ర దాడులు చేయాలని, ఉగ్రవాదులు పథకాలు రచించారని గుర్తించారు పోలీసులు. దీంతో అప్రమత్తమై ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు నిఘా పెంచారు.
బీహార్ , యూపీలను టార్గెట్ చేసిన ఉగ్రవాదుల ప్లాన్ .. ఇంటిలిజెన్స్ బట్టబయలు
పాకిస్తాన్ ప్రేరేపిత ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) మరోసారి భారతదేశానికి పెద్ద నష్టం కలిగించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఇప్పటికే ఇంటిలిజెన్స్ హెచ్చరికలు జారీ చేస్తుంది. పంజాబ్ మరియు ఇతర రాష్ట్రాల నుండి ఉత్తర ప్రదేశ్ మరియు బీహార్లకు కార్మికులను తీసుకెళ్లే రైళ్లను లక్ష్యంగా చేసుకోవడానికి ఐఎస్ఐ స్లీపర్ సెల్స్ ప్రణాళికలను ఇటీవల భారత అధికారులు బహిర్గతం చేశారు. బీహార్ మరియు యుపి నుండి కార్మికులతో ప్రయాణాలు సాగించే రైళ్లలో పేలుళ్లను జరపాలని, భారత్ కు తీరని ప్రాణ నష్టం చేకూర్చి తమ ఉనికి చాటుకోవాలని ఉగ్రమూక శతవిధాలా ప్రయత్నం చేస్తుందని అధికారులు వాళ్ళ ప్లాన్ ను బట్టబయలు చేశారు .
రైళ్ళను టార్గెట్ చేసి ఎక్కువ ప్రాణ నష్టం చెయ్యాలని ప్లాన్
శిక్షణ పొందిన ఉగ్రవాదులు రైళ్లను టార్గెట్ చేయాలని ఐఎస్ఐ ఆపరేటివ్కు సంబంధించిన సమాచారాన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించి ఈ విషయంలో హెచ్చరికను జారీ చేశాయి. బీహార్ రైల్ పోలీసు డిపార్ట్మెంటల్ లెటర్ ద్వారా టెర్రర్ ప్లాన్ తెరపైకి వచ్చింది. లేఖ ప్రకారం, పాకిస్తాన్ ఐఎస్ఐ పంజాబ్లోని తన స్లీపర్ సెల్కు టైమర్ బాంబును అందించడానికి ఆఫర్ చేసింది. లేఖలో తెలిపిన వివరాల ప్రకారం, పంజాబ్ నుండి ఉత్తర ప్రదేశ్ మరియు బీహార్ వంటి రాష్ట్రాలకు వెళ్లే రైళ్లలో బాంబు పెట్టాలని స్లీపర్ సెల్స్ ఆదేశించబడ్డాయి. ఇది దేశంలోని కొన్ని ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుంది.
అలెర్ట్ అయిన యూపీ, బీహార్ రైళ్ళ విభాగాలు
ఈ లేఖ రైల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మరియు అనేక రైల్ ఎస్పీలు, ఎస్పీడీవో లకు సిబ్బందికి అవుట్ పోస్ట్ ఇంచార్జ్ లకు పంపబడింది. వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితికి సిద్ధంగా ఉండటానికి డాగ్ మరియు బాంబ్ స్క్వాడ్లు సిద్ధంగా ఉండాలని కోరారు. ఇది కాకుండా, సీసీటీవీలు మరియు ఎలక్ట్రానిక్ నిఘా ద్వారా అనేక రైల్వే స్టేషన్ ఆవరణల చుట్టూ కార్యకలాపాలను భద్రతా సంస్థలు పర్యవేక్షిస్తున్నాయి. రైళ్ల లోపల సివిల్ డ్రెస్లో రైల్వే పోలీసులను కూడా నియమించారు.