ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం: ఇంటి యజమాని సురక్షితం, ఓ జవాను మృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాంబన్ జిల్లా బటోటే గ్రామంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు శనివారం మధ్యాహ్నం చొరబడ్డారు. ఆ ఇంటి యజమానిని కూడా వారితోపాటు బంధించారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
ఆ ప్రాంతంలో జల్లెడపడుతూ.. వాహనాలను కూడా తనిఖీ చేశారు. ఉగ్రవాదుల అదుపులో ఉన్న వారిని కాపాడేందుకు భద్రతా బలగాలు ప్రయత్నించారు. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ తోపాటు ఆర్మీ కూడా ఉగ్రవాదులను తుదముట్టించేందుకు ప్రయత్నాలు చేశారు.

విజయ్ కుమార్ అనే టైలర్ ఇంట్లో ఉగ్రవాదులు చొరబడి, ఆయన కుటుంబసభ్యులను కూడా బంధించారు. కాగా, ఉగ్రవాదులు ఒక్కసారిగా భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు కూడా ధీటుగా జవాబిచ్చాయి.
భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాను అమరుడయ్యాడు. కాగా, ఉగ్రవాదుల బంధీలో ఉన్న ఇంట్లో యజమానిని భద్రతా దళాలు కాపాడాయి. ఉగ్రవాదుల హతమవడంతో అక్కడ ఆపరేషన్ ముగిసింది.
ఇది ఇలా ఉంటే, రాంబన్ తోపాటు దొడ, గండెర్బల్ ప్రాంతాల్లో కూడా ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సమాచారం ఉండటంతో ఆ ప్రాంతంలో కూడా భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి.
ఉదయం ఎన్కౌంటర్లోనూ ముగ్గురు ఉగ్రవాదుల హతం
గండర్ బాల్ జిల్లాలోని నారనాగ్ గ్రామంలో శనివారం ఉదయం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భారత భద్రతా బలగాలు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు ఆ ఊరిలో మొదట కార్టన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.
భద్రతా దళాలు సోదాలు నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు చేశాయి. భద్రత బలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, సంఘటనా స్థలం నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications