PUNJAB ELECTIONS 2022 : ఆప్ సత్తా చాటేనా - వ్యూహాత్మక అడుగులు : హామీలపై కసరత్తు..!!
ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పుడు మరిన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు అమలు చేస్తోంది. ప్రధానంగా త్వరలో జరిగే ఎన్నికలకు సంబంధించి గోవా..పంజాబ్ పైన ఫోకస్ పెట్టింది. పంజాబ్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అభ్యర్ధులను ఎన్నికలకు చాలా రోజుల ముందే ప్రకటించి ప్రచారాన్ని హోరెత్తించేలా వ్యూహాలకు పదునుపెడుతోంది. 2022లో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ జాతీయ సమన్వయకర్త, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సన్నద్ధమైంది.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ తొలి జాబితాను ఇప్పటికే విడుదల చేసింది. పది మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆప్ ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని శక్తియుక్తులను కూడదీసుకుంటోంది. పంజాబ్లో తమ పార్టీ అధికార పగ్గాలు చేపడితే ఉచిత విద్యుత్, ఉచిత వైద్యం వంటి పలు హామీలను ఆప్ ప్రకటించింది. అదే విధంగా మహిళలను సైతం తమ వైపు తిప్పుకొనే వ్యూహాలను అమలు చేస్తోంది. అధికారంలోకి వస్తే ప్రతీ మహిళకు నెలకు వెయ్యి రూపాయాల చొప్పున ఆర్దిక సాయం అందిస్తామని ప్రకటించింది.
ఈ నెల చివరి వారంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కొత్త వేరియంట్ ఓమిక్రాన్ పైన హెచ్చిరికలు వస్తున్న నేపథ్యంలో ఎణ్నికల సంఘం ఆచితూచి స్పందించే అవకాశం ఉంది. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ పదవీ కాలం 2022 మార్చితో పూర్తవుతుండగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం మేలో ముగియనుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ల్లో బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వాలు, పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి.
కాగా, పంజాబ్ లో తిరిగి తాము అధికారం దక్కించుకుంటామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతలు ఎక్కువగా ఉత్తర ప్రదేశ్ పైనే ఫోకస్ పెట్టింది. కీలక నేతలతో కలిసి రధయాత్రకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. పంజాబ్ పైన బీజేపీ ఆశలు పెట్టుకుంది. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీంర్ సింగ్ బయటకు రావటం.. తమతో కలిసేందుకు సిద్దంగా ఉండటంతో బీజేపీ అక్కడ కూడా వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తోంది. దీంతో..ఇప్పుడు పంజాబ్ లో అటు కాంగ్రెస్.. ఇప్పటికీ ఎవరితో కలుస్తుందో చెప్పలేని బీజేపీ నడుమ ప్రస్తుతం ఉన్న బలాన్ని మరింతగా పెంచుకొని..అధికారం దిశగా దూసుకెళ్లాలని ఆప్ భావిస్తోంది. దీంతో.. పంజాబ్ లో మారుతున్న బలా బలాల పైన ఆసక్తి పెరుగుతోంది.