జయకు షాక్: 4 వేల పేజీలతో సుప్రీంకు కర్ణాటక అప్పీల్
బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత అక్రమాస్తుల కేసు తీర్పుపై కర్ణాటక ప్రభుత్వం నాలుగు వేల పేజీలతో సుప్రీం కోర్టులో అప్పీలు చేసింది. అందులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన 100 పేజీల తీర్పు ప్రతులను కూడా పొందుపరిచారు.
అక్రమాస్తులు సంపాదించారని జయలలితతో పాటు మరొ ముగ్గురి మీద కేసులు నమోదు అయ్యింది. ఈ కేసులో జయలలిత తదితరులకు బెంగళూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించింది. తరువాత జయలలిత తదితరులు కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు.
కేసు విచారణ చేసిన కర్ణాటక హైకోర్టు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి కుమారస్వామి జయలలిత అక్రమ ఆస్తులు సంపాదించలేదని కేసును కొట్టి వేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీ.వీ. ఆచార్య ఈ కేసును సుప్రీం కోర్టులో అప్పీలు చెయ్యాలని పట్టుబట్టారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన మంత్రి వర్గంతో పదేపదే చర్చించి చివరికి సుప్రీం కోర్టులో అప్పీలు చెయ్యాలని నిర్ణయించారు. మంగళవారం నాలుగు వేల పేజీల డాక్యూమెంట్ లతో సుప్రీం కోర్టులో అప్పీలు చేశారు. హైకోర్టు తీర్పును చాలెంజ్ చేస్తు సుప్రీం కోర్టును ఆశ్రయించామని న్యాయనిపుణలు అంటున్నారు.