Union Budget 2020: కొత్తగా కిసాన్ రైలు..16 సూత్రాలు: వ్యవసాయ రంగానికి 2.83 లక్షల కోట్లు..!
Recommended Video
న్యూఢిల్లీ: దేశంలో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దీనికోసం 16 సూత్రాలను రూపొందించామని, వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తామని చెప్పారు. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి 2.83 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా చేపట్టని కొన్ని అరుదైన పథకాలకు జీవం పోశామని అన్నారు.
వ్యవసాయోత్పత్తుల రవాణాకు కిసాన్ రైలు..
దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయం తమ ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, వాటిని నివారించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని అన్నారు. కిసాన్ రైలు పేరుతో ఓ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని వస్తామని చెప్పారు. రైల్వే మంత్రిత్వ శాఖ దీన్ని ఏర్పాటు చేస్తుందని, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ఈ రైళ్లను నిర్వహిస్తారని అన్నారు.
శీతల గిడ్డంగుల తరహాలో..
శీతల గిడ్డంగుల తరహాలో ఈ కిసాన్ రైళ్లు పని చేస్తాయని అన్నారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే.. తరలించడానికి ఈ కిసాన్ రైళ్లు ఉపకరిస్తాయని చెప్పారు. ఎన్ని రోజులైనప్పటికీ.. వ్యవసాయ ఉత్పత్తులు చెడిపోకుండా ఉండేలా.. ఏసీ సౌకర్యాన్ని ఈ రైళ్లకు కల్పించదలిచామని నిర్మలా సీతారామన్ చెప్పారు. వ్యవసాయరంగం, వాటి అనుబంధ రంగాల్లో దీన్ని ఒక విప్లవాత్మక మార్పులా ఆమె అభివర్ణించారు.
జీడీపీలో వ్యవసాయ రంగం వాటా పెంపు..
దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయ రంగం వాటాను గణనీయంగా పెంచాలనే ఉద్దేశంతోనే ఈ సారి ఏకంగా 2.83 లక్షల కోట్ల బడ్జెట్ను కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 6 నుంచి 6.50 శాతం జీడీపీ వృద్ది రేటును నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఈ పరిస్థితుల్లో వ్యవసాయం సహా దాదాపు అన్ని రంగాల వాటాను పెంచడానికి అనేక చర్యలు చేపట్టామని తెలిపారు.
రైతుల ఖాళీ స్థలాల్లో సౌర విద్యుత్ కేంద్రాలు..
రైతులకు చెందిన ఖాళీ స్థలాల్లో సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలను అందజేస్తామని అన్నారు. ఆయా కేంద్రాల్లో ఉత్పత్తి అయిన విద్యుత్ను నేరుగా ప్రధాన గ్రిడ్కు అనుసంధానిస్తామని, ఆ విద్యుత్ను రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇలా ఏకంగా 15 లక్షల మంది రైతుల సౌర విద్యుత్ కేంద్రాలను ప్రధాన గ్రిడ్కు అనుసంధానిస్తామని చెప్పారు. ఈ రకంగా కూడా రైతాంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తామని అన్నారు. 20 లక్షల మంది రైతులకు సౌర విద్యుత్ పంపులను సరఫరా చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు.