రూ. 40 కోట్లు లంచం: మాజీ సీఎంకు సీబీఐ క్లీన్ చిట్
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, శివమోగ్గ ఎంపీ, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప, ఆయన కుటుంబ సభ్యులు, బీజేపీ మాజీ మంత్రులు ఊపిరిపీల్చుకున్నారు. యడ్యూరప్పకు సీబీఐ ప్రత్యేక కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.
యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిందాల్ కంపెనీకి అనుకూలంగా టెండర్లు వెయ్యడానికి రూ. 40 కోట్లు లంచం తీసుకున్నారని ఆరోపణలు రావడతో సీబీఐ కేసు నమోదు చేసింది.
జిందాల్ కంపెనీకి సహకరించినందుకు యడ్యూరప్ప కుటుంబ సభ్యులకు చెందిన ప్రేరణా ట్రస్ట్ కు. 40 కోట్లు జమ చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. యడ్యూరప్పతో పాటు ఆయన కుమారులు బీవై. విజయేంద్ర, బీవై రాఘవేంద్ర, ఆయన అల్లుడు సోహాన్ కుమార్ పేర్లు ఉన్నాయి.
వీరితో పాటు అప్పటి బీజేపీ మంత్రులు కృష్ణయ్యశెట్టి, రేణుకాచార్య, జిందాల్ సంస్థ, సౌత్ వెస్ట్ సంస్థ డైరెక్టర్లతో పాటు 13 మంది మీద కేసులు నమోదు అయ్యాయి. మొత్తం ఐదు కేసులు సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.
2012 డిసెంబర్ 10వ తేదిన బీఎస్ యడ్యూరప్పకు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి కేసు విచారణ జరిగింది. బుధవారం సిటి సివిల్ కోర్టు ఆవరణంలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి.
సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తులు బీఆర్. ధర్మ, ఆర్ బీ. ధర్మేగౌడ కేసు తీర్పును వెల్లడించారు, యడ్యూరప్ప తదితరులకు క్లీన్ చిట్ ఇస్తూ తీర్పు చెప్పారు. యడ్యూరప్ప న్యాయవాది సీవీ. నాగేష్ కోర్టులో వాదించారు.
యడ్యూరప్ప నేరం చేసినట్లు రుజువు అయితే కనీసం ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడిఉండే అవకాశం ఉందని, మూడు సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడితే బెయిల్ తీసుకునే అవకాశం ఉందని గతంలో న్యాయనిపుణులు చెప్పారు.
యడ్యూరప్ప ముందు జాగ్రత్తగా జామీను ఇవ్వడానికి అనుచరులను కోర్టుకు తీసుకువచ్చారు. యడ్యూరప్పకు క్లీన్ చిట్ రావడంతో బీజేపీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు నగరంతో పాటు శివమొగ్గలో ఆయన అభిమానులు స్వీట్లు పంచుకున్నారు. ఈ కేసు విషయంపై సీబీఐ పై కోర్టులో అప్పీలు చెయ్యడానికి సిద్దం అయ్యిందని సమాచారం.