జయ టైంలో ఎన్నో చూశా, నేను చస్తానని రాయలేదు: శశికళ సంచలనం
అన్నాడీఎంకే అధినేత్రి శశికళ ఆదివారం నాడు మరోసారి ఘాటుగా స్పందించారు. తన వైపు నుంచి ఒక్కరొక్కరుగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, కీలక నేతలు వెళ్లిపోవడంపై స్పందించారు.
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళ ఆదివారం నాడు మరోసారి ఘాటుగా స్పందించారు. తన వైపు నుంచి ఒక్కరొక్కరుగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, కీలక నేతలు వెళ్లిపోవడంపై స్పందించారు.
ఓ వైపు నేతలు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వైపు వెళ్తుంటే.. చిన్నమ్మ వర్గంలో ఆందోళన కనిపిస్తోంది. శశికళలోను టెన్షన్ ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే శశికళ తాజాగా మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆమె నిబ్బరంగా కనిపిస్తున్నారు.
ఆదివారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీలు గీత దాటడం వెనుక కుట్ర ఉందని చెప్పారు. ఎమ్మెల్యేలు అందరూ తన వెనుకే ఉన్నారని చెప్పారు. ఎలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. రాజ్యంగం పైన తనకు నమ్మకం ఉందని చెప్పారు.
పన్నీరుసెల్వం ఊహించని ట్విస్ట్, అప్రమత్తమైన శశికళ.. రిసార్ట్కు
అమ్మ జయలలిత ఉన్నప్పుడు రెండుసార్లు ఇలాంటి సంక్షోభాలు వచ్చాయన్నారు. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పారు. అమ్మ హయాంలో ఇలాంటివి ఎన్నో చూశామని, గవర్నర్ ఆలస్యం చేయడం వల్లే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు.
సంక్షోభాలు ఎన్నో దాటాం
పార్టీని స్థాపించినప్పటి నుంచి ఉన్న వాళ్లే నిజమైన కార్యకర్తలు అన్నారు. పలుమార్లు సంక్షోభాలు దాటుకొని అధికారంలోకి వచ్చామని చెప్పారు. సంక్షోభాలు కొత్త కాదు కాబట్టి, ఎదుర్కొంటామన్నారు.
ఏం జరుగుతుందో అందరికీ తెలుసు
తమిళనాడులో ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని శశికళ చెప్పారు. ఈ సంక్షోభం వెనుక ఎవరి కుట్ర ఉందో కూడా అందరికీ తెలుసునని, జర్నలిస్టులు అయిన మీకు తెలియదా అని వ్యాఖ్యానించారు. కొందరు పార్టీని చీల్చేందుకు కుట్ర చేస్తున్నారన్నారు.
ప్రధాన కార్యదర్శిగా నా హామీ
నాలుగేళ్ల పాటు మన ప్రభుత్వమే ఉంటుందని శసికళ చెప్పారు. అన్నాడీఎంకే ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని తేల్చి చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను హామీ ఇస్తున్నానని, ప్రభుత్వం ఉంటుందన్నారు. భయపడకుండా ముందుకెళ్తామని చెప్పారు.
నాపై దుష్ప్రచారం
తన పైన దుష్ప్రచారం జరుగుతోందని చెప్పారు. 133 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం సరికాదని గవర్నర్ విద్యాసాగర రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పార్టీ నేతలు అంతా తనతోనే ఉన్నారన్నారు.
గవర్నర్కు చస్తానని లేఖ రాయలేదు
గవర్నర్ విద్యాసాగర రావుకు బెదిరింపు లేఖ రాసినట్లుగా తన పైన వస్తున్న వార్తలు సరికాదని శశికళ అన్నారు. తనను ముఖ్యమంత్రిగా చేయకుండా నేను చచ్చిపోతానని గవర్నర్కు లేఖ రాసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోందని, అది అవాస్తవం అన్నారు. అది ఫేక్ లెటర్ అని, తన ప్రత్యర్థుల కుట్ర అన్నారు.