శశికళకు ఊరట:'అక్రమాస్తుల కేసులో సుప్రీం తీర్పు వచ్చేవారమే
అక్రమాస్తుల కేసులో ఈ వారంలో సుప్రీం కోర్టు తీర్పు వచ్చే అవకాశం లేదు. వచ్చేవారంలో ఈ కేసుపై తీర్పు వచ్చే అవకాశం ఉంది.
చెన్నై:జయ అక్రమాస్తుల కేసు తీర్పు ఈ వారం వచ్చే అవకాశం లేదు. వచ్చేవారంలో ఈ కేసుకు సంబందించిన తీర్పు వెలువడే అవకాశం కన్పిస్తోంది.ఈ వారంలో శుక్రవారం నాడు మాత్రమే సుప్రీంకోర్టు పనిచేస్తోంది. అయితే శుక్రవారం నాడు ఈ కేసు లిస్టు కాలేదని సమాచారం.వచ్చే వారంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉంది.
జయలలిత అక్రమాస్తుల కేసులో వారం రోజుల్లో తీర్పు ఇవ్వనున్నట్టు గతంలో కోర్టు తెలిపింది.అయితే ఏ రోజున ఈ కేసుకు సంబంధించి తీర్పును వెలువరచనుందో కోర్టు మాత్రం స్పష్టం చేయలేదు.
ఈ కేసులో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో పాటు శశికళ కూడ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.అయితే ఈ కేసు తీర్పు వచ్చే అవకాశం ఉన్నందున గవర్నర్ వేచిచూసే ధోరణిని అవలంభిస్తున్నారు. ఈ విషయమై ఆయన న్యాయనిపుణులతో చర్చించారని సమాచారం.
ఈ కేసులో జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్ నిందితులుగా ఉన్నారు. గతంలో ఈ కేసును విచారించిన ప్రత్యేక న్యాయస్థానం ఈ నలుగురికి కారాగారశిక్ష విధించింది. అనంతరం ఈ కేసును కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది.ఈ కేసుపై కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది.
ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న క్రమంలో సుప్రీంకోర్టు తీర్పుపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఈ కేసులో శశికళకు శిక్ష పడితే ఆమె ముఖ్యమంత్రి పీఠానికి దూరం కానున్నారు. అంతే కాదు ఆమె రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
వాస్తవానికి ఈ వారంలోనే ఈ కేసు తీర్పు వచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు.అయితే శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో ఈ కేసు లిస్ట్ కాలేదు.శనివారం కోర్టుకు సెలవు.దీంతో ఈ వారం ఈ కేసులో తీర్పు వచ్చే అవకాశం లేదు.వచ్చే వారమే ఈ కేసులో తీర్పు వచ్చే అవకాశం ఉంది.