బ్లాక్ అవుట్పై బాంబు పేల్చిన మంత్రి: సెంట్రల్ జనరేషన్ స్టేషన్ల నుంచి 15 శాతం రాష్ట్రాలకు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాలు బొగ్గు ఉత్పత్తిని స్తంభింపజేశాయి. వరద నీరు ముంచెత్తడంతో బొగ్గు గనుల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. డిమాండ్కు అనుగుణంగా బొగ్గు సరఫరా ఉండట్లేదు. బొగ్గు వెలికితీత పనులు నిలిచిపోయాయి. దీని ప్రభావం థర్మల్ కేంద్రాలపై పడింది. బొగ్గు ఆధారంతో నడిచే థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి మందగించింది. దేశవ్యాప్తంగా థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు క్షీణించాయి. ఫలితంగా- విద్యుత్ ఉత్పత్తిని నియంత్రించాల్సి వస్తోంది.
Recommended Video
Power Crisis in Telangana: కరెంటు కోతలు ఉండబోవంటూ మంత్రి జగదీష్ రెడ్డి హామీ
డిమాండ్ను అనుగుణంగా విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల.. అధికారికంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా విద్యుత్ కొరతను విధిస్తోన్నాయి. ఈ పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే ప్రకటన చేసింది. కేంద్రీయ విద్యుత్ ఉత్పాదక సంస్థల్లో ఎవరికీ కేటాయించని విద్యుత్ను వినియోగించుకోవాల్సిందిగా సూచించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వంటివి.. కేంద్రీయ విద్యుత్ ఉత్పాదక సంస్థల పరిధిలోకి వస్తాయి. ఎన్టీపీసీ కేంద్రాలు- ఏ రాష్ట్రంలో ఉంటే.. ఆ రాష్ట్రాలకు కల్పించిన కేటాయింపులు పోగా.. మిగిలిన విద్యుత్ మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. డిమాండ్కు అనుగుణంగా దాన్ని అన్ని రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. అదే సమయంలో- ఎవరికీ కేటాయించని విద్యుత్ కోటాను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకుంటుంది. ఒక ఎన్టీపీసీ కేంద్రంలో వందశాతం మేర విద్యుత్ ఉత్పత్తి చోటు చేసుకుంటే అందులో 15 శాతాన్ని నాన్ అలకేటెడ్ పవర్గా భావిస్తారు.
దేశవ్యాప్తంగా అన్ని సెంట్రల్ పవర్ జనరేషన్స్ అన్నింట్లోనూ ఇలా 15 శాతం వరకు ఎవరికీ కేటాయించని విద్యుత్ కోటా ఉంటుంది. విద్యుత్ సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పుడు దాన్ని వినియోగించుకోవడానికే ఈ నాన్ అలకేటెడ్ పవర్ కోటాను అందుబాటులోకి తీసుకొచ్చింది. బొగ్గు కొరత వల్ల దేశవ్యాప్తంగా నెలకొన్న విద్యుత్ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని- ఇప్పుడు ఆ కోటాను వినియోగించుకోవాల్సిందిగా కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ఇంకొద్ది రోజుల్లో బ్లాక్ అవుట్ను ఎదుర్కొంటుందని భావిస్తోన్న దేశ రాజధానిలోని విద్యుత్ ఉత్పాదక సంస్థల్లో బొగ్గు నిల్వలు అడుగంటాయని విద్యుత్ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ స్పష్టం చేశారు. కొరతను అధిగమించడానికి ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ను కొనుగోలు చేయాల్సి వస్తోందని అన్నారు. బొగ్గు సంక్షోభం వల్ల ఎన్టీపీసీ కేంద్రాలు పూర్తిస్థాయిలో విద్యుత్ను ఉత్పత్తి చేయట్లేదని, 50 శాతానికి తగ్గించాయని చెప్పారు.
ఎన్టీపీసీ కేంద్రాలు 50 శాతం వరకే విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి రెండు కారణాలు ఉండొచ్చని సత్యేంద్ర జైన్ చెప్పారు. ఒకటి- బొగ్గు కొరత.. రెండో కారణం- కేంద్ర ప్రభుత్వమే ఎన్టీపీసీల్లో విద్యుత్ ఉత్పత్తిని నియంత్రించాలని ఆదేశించి ఉండొచ్చని అన్నారు. ఎన్టీపీసీ నుంచి అందే విద్యుత్ సరఫరా మీదే బ్లాక్ అవుట్ ఆధారపడి ఉంటుందని, ప్రస్తుతానికి సగం కరెంటు మాత్రమే అందుతోందని చెప్పారు. ఈ సగం కూడా నిలిచిపోతే బ్లాక్ అవుట్ తప్పదని సత్యేంద్ర జైన్ ఆందోళన వ్యక్తం చేశారు.