Gay Marriage: గే వివాహ చట్టబద్ధతపై కేంద్రానికి నోటీసులిచ్చిన సుప్రీం..
ప్రత్యేక వివాహ చట్టం, 1954 ప్రకారం స్వలింగ వివాహాన్ని గుర్తించాలని కోరుతూ స్వలింగ సంపర్కుల జంచ దాఖలు చేసిన రెండు ప్రజాహిత వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ కేంద్ర ప్రభుత్వంతో పాటు అటార్నీ జనరల్కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ, ఈ సమస్య నవతేజ్ సింగ్ జోహార్, పుట్టస్వామి తీర్పులకు "సీక్వెల్" అని పేర్కొన్నారు. "ఇది జీవన సమస్య, ఆస్తి సమస్య కాదు. మేము ఇక్కడ ప్రత్యేక వివాహ చట్టం గురించి మాత్రమే మాట్లాడుతున్నాము" అని అన్నారు. హిందూ వివాహ చట్టం ప్రకారం స్వలింగ వివాహాన్ని గుర్తించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టు, కేరళ హైకోర్టులో 9 పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి.
పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్, కేసులన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేరళ హైకోర్టు ముందు కేంద్రం చేసిన ప్రకటనపై ధర్మాసనానికి తెలిపారు. స్వలింగ జంటల గ్రాట్యుటీ, దత్తత, సరోగసీ వంటి ప్రాథమిక హక్కులను ఈ సమస్య ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.