సీఎంగా మూడోసారి ప్రమాణం: పాటపడిన అరవింద్ కేజ్రీవాల్(వీడియో)
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ప్రమాణం చేశారు. ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో 'ధన్యవాద్ ఢిల్లీ'పేరుతో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ తోపాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
కాగా, ఈ కార్యక్రమం ముగింపు సమయంలో అరవింద్ కేజ్రీవాల్ తన పాటతో అందర్నీ ఆకట్టుకున్నారు. తాను ఒక షరతుతో పాట పాడతానని.. తాను పాట పాడితే తనతోపాటు ఇక్కడున్నవారంతా కూడా పాడాలని అన్నారు. దీంతో వారంతా అరవింద్ కేజ్రీవాల్ తోపాటు పాటను పాడారు.
Recommended Video
'హమ్ హోంగే కామ్ యాబ్'(మనమంతా కలిసి అధిగమించగలం) అంటూ పాటను అందుకున్నారు అరవింద్ కేజ్రీవాల్.. ఆయనతోపాటు అక్కడున్నవారంతా తమ గొంతును కలిపారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
#WATCH Delhi Chief Minister Arvind Kejriwal sings 'Hum honge kaamyaab', at his swearing-in ceremony pic.twitter.com/hwXi8FUW46
— ANI (@ANI) February 16, 2020
కాగా, 1960లలో అమెరికాలో పౌర హక్కుల ఉద్యమంలో 'మనమంతా కలిసి అధిగమించగలం(we shall overcome)' పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. అంతేగాక, ఆ ఉద్యమానికి ఊపిరిగా మారింది. ఇదే పాటను హిందీ కవి గిరిజకుమార్ మాథూర్ 'హమ్ హోంగే కామ్ యాబ్' పేరుతో హిందీలోకి అనువాదం చేశారు.
ఇది ఇలావుండగా, ఆదివారం మధ్యాహ్నం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, మరో ఆరుగురు ఎమ్మెల్యేలు మనీష్ సిసోడియా, కైలేష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్, రాజేంద్ర పాల్ గౌతమ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారం సందర్భంగా భారత్ మాతా కీ జై, వందేమాతరం అనే నినాదాలు కూడా చేశారు కేజ్రీవాల్. ఢిల్లీని అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్బంగా తెలిపారు.
ప్రచారంలో భాగంగా తమపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన ప్రత్యర్థుల్ని క్షమించేస్తున్నామని అన్నారు. ఢిల్లీ అభివృద్ధికి ఇదే వేదికపై నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులు కోరుతున్నానని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎవరిపైనా సవతి తల్లి ప్రేమ చూపలేదని.. అన్ని వర్గాలకు కలుపుకొనిపోయామని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. మీ బిడ్డ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడని ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఢిల్లీ అంతా ఇప్పుడు తన కుటుంబమే అని, అందరి కోసం పనిచేస్తామన్నారు.