ఇంఫాల్ మార్కెట్లో బాంబు పేలుడు: ముగ్గురు మృతి, 23మందికి గాయాలు
ఇంఫాల్: మణిపూర్ రాజధాని ఇంఫాల్లోని మార్కెట్ కాంప్లెక్స్ సమీపంలో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం సాయంత్రం 6గంటల ప్రాంతంలో పేలుడు సంభవించిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం రీజినల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్కు తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కాగా, పేలుడుకు సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత తీసుకోలేదు. పేలుడు బాధితుల్లో ఇద్దరు మణిపూర్ రాష్ట్ర వాసులు కాదని పోలీసులు గుర్తించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

గ్రామ సర్పంచ్ను హతమార్చిన మావోయిస్టులు
రాయ్పూర్: ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో కొత్తగా ఎన్నికైన సర్పంచును, ఓ వ్యక్తిని ఎత్తుకెళ్లిన మావోయిస్టులు, వారిని హతమార్చారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. గొళ్లపల్లి గ్రామ సర్పంచ్ సచ్చమ్ హిద్మా, పొల్లంపల్లికి చెందిన పునెం పాండులను మావోయిస్టులు మార్చి 7న ఎత్తుకెళ్లారు. వీరితోపాటు మరో ఆరుగుర్ని కూడా మావోయిస్టులు ఎత్తుకెళ్లారు.
కాగా, హిద్మా, పాండులను హతమార్చిన మావోయిస్టులు, మిగితా వారిని బెదిరించి విడిచిపెట్టినట్లు సుక్మా జిల్లా ఏఎస్పీ సంతోష్ సింగ్ తెలిపారు. హిద్మా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు తెలిపిన ఆయన, పాండు మృతదేహం లభించలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications