అసెంబ్లీలోనే ఎమ్మెల్యేల బలప్రదర్శన: స్టాలిన్ డిమాండ్, పన్నీర్ కే !
తమిళనాడు అసెంబ్లీలోనే ఎమ్మెల్యేల బలప్రదర్శనకు అవకాశం ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ గవర్నర్ విద్యాసాగర్ రావుకు మనవి చెయ్యనున్నారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి అనే విషయంపై ఎమ్మెల్యేలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలని, అందుకు అసెంబ్లీలోనే శాసన సభ్యుల మద్దతు ఎవ్వరికి ఉందనే విషయం తెలుసుకోవడానికి అవకాశం కల్పించాలని ఎంకే. స్టాలిన్ అన్నారు.
తమిళనాడు అసెంబ్లీలోనే ఎమ్మెల్యేల బలప్రదర్శనకు అవకాశం ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ గవర్నర్ విద్యాసాగర్ రావుకు మనవి చెయ్యనున్నారు. డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన ఎంకే. స్టాలిన్ గురువారం చెన్నైలో విలేకరులతో మాట్లాడారు.

తమిళనాడు రాజకీయాల గురించి ఇప్పుడు దేశం మొత్తం అనేకరకాలుగా చర్చించుకుంటుందని అన్నారు. ఎమ్మెల్యేలను మభ్యపెట్టి ఎవ్వరు సీఎం అయినా ఎక్కువ కాలం అధికారంలో ఉండలేరని స్టాలిన్ జోస్యం చెప్పారు. అన్నాడీఎంకే పార్టీ వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు.
అయితే తమిళ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మాత్రం ప్రలోభాలకు లొంగకుండా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవలసిన అవసరం వచ్చిందని, అది అందరికీ మంచిదని చెప్పారు. శశికళల రిసార్ట్ రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.
రిసార్ట్ రాజకీయాలు చేస్తే ప్రజల నుంచి మద్దతు వస్తుందా అంటూ పరోక్షంగా శశికళకు ఝలక్ ఇచ్చారు. ప్రస్తుతం నాయకత్వంలేని తమిళనాడు ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. తాను గవర్నర్ ను కలిసి అసెంబ్లీలోనే ఎమ్మెల్యేల బలప్రదర్శనకు అవకాశం ఇవ్వాలని మనవి చేస్తానని ఎంకే. స్టాలిన్ చెప్పారు.












Click it and Unblock the Notifications