రోజుకు 80 లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తేనే... ఏడాది చివరి నాటికి లక్ష్యం చేరతాం: క్రైసిల్
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా వేధిస్తున్న కరోనా వ్యాక్సిన్ కొరత దేశంలో తీరిపోయినట్లు కనిపిస్తోంది. దేశంలో 18 ఏళ్లు నిండినవారందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగానే అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన తర్వాత నుంచి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొంత వేగం పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
వ్యాక్సినేషన్ మూడు రేట్లు పెంచితేనే..
ఈ క్రమంలో మరింత వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగించాల్సిన అవసరం ఉందని మార్కెట్ పరిశోధన సంస్థ క్రైసిల్(సీఆర్ఐఎస్ఐఎల్) స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ రేట్ను మూడు రేట్లు పెంచినట్లయితేనే ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి 100 శాతం పెద్దలందరికీ వ్యాక్సిన్ ఇవ్వగలమని పేర్కొంది. సరఫరా లోపం కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించిందని క్రైసిల్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఏప్రిల్ నెలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరిగిందని, మేలో నెమ్మదించిందని పేర్కొంది. ప్రస్తుత జూన్ నెలలో కొంత మెరుగుపడిందని తెలిపింది.
రోజుకు 8 మిలియన్ల మందికి వ్యాక్సిన్ ఇస్తేనే..
జూన్ 21న దేశంలో ఒకేరోజులో 8.6 మిలియన్ల మందికి వ్యాక్సిన్ వేసి రికార్డు సృష్టించారని వెల్లడించింది. 2021 చివరి వరకు కూడా ఇదే వేగం కొనసాగించాలని క్రైసిల్ సూచించింది. ఇప్పటి వరకు దేశంలోని జనభాలో 3.8 శాతం మందికే రెండు వ్యాక్సిన్లు వేయడం జరిగిందని, 17.2 శాతం మంది ఒక డోసు తీసుకున్నారని పేర్కొంది. దేశంలోని పెద్దలందరికీ ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ పూర్తి చేయాలంటే రోజుకు 8 మిలియన్లకు తక్కువ కాకుండా వ్యాక్సిన్ ఇవ్వాలని క్రైసిల్ స్పష్టం చేసింది.
భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే..
టీకాలు వేయడం ఆర్థిక కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉందని, టీకా రేటు పెరిగే వరకు మొత్తం ఆర్థిక కార్యకలాపాలు మందగమనం కొనసాగుతుందని అంచనా వేసింది. టీకా డ్రైవ్ త్వరగా పెంచడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకునే అవకాశం ఉందని క్రైసిల్ పేర్కొంది. అమెరికా, బ్రిటన్లో వ్యాక్సినేషన్ ప్రక్రియలో ముందున్నాయని తెలిపింది.
ఈ దేశాలు సుమారు 40 శాతం దేశ జనాభాకు పూర్తి వ్యాక్సిన్ అందించాయని పేర్కొంది. దీంతో ఆ దేశాల్లో ఆర్థిక కార్యకలాపాల వేగం కూడా పుంజుకుందని వివరించింది. అందరూ వ్యాక్సిన్ తీసుకుంటే.. ఆంక్షలను పూర్తిగా సడలించేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. అయితే, కరోనా నిబంధనలను పాటించడంలో నిర్లక్ష్యం వద్దని స్పస్టం చేసింది. కేంద్రం కూడా ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని పెద్దలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ప్రకటించింది.