టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రియన్పై పార్లమెంటు శీతాకాల సమావేశాల నుంచి సస్పెన్షన్ వేటు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల నుంచి మరో ఎంపీ సస్పెండ్ అయ్యారు. పార్లమెంటులో నిబంధనలు ఉల్లంఘించారంటూ టీఎంసీ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఒబ్రియన్ ను పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పాల్గొనకుండా సస్పెండ్ చేశారు.
మంగళవారం రాజ్యసభలో ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021పై చర్చ జరుగుతున్న సమయంలో ఎంపీ డెరెక్ ఒబ్రియన్ రాజ్యసభ రూల్బుక్ను ఛైర్మన్ చైర్ వైపు విసిరేశారు. దీంతో సభ నియమావళిని ఉల్లంఘించినందుకు ఆయనను ప్రస్తుత శీతాకాల సమావేశాలు మొత్తం హాజరుకాకుండా ఛైర్మన్ నిషేధం విధించారు.

కాగా, తనను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయడం పట్ల టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రియాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించలేదనే నెపంతో తనను సస్పెండ్ చేశారని కేంద్రంపై మండిపడ్డారు. నిబంధనల పేరుతో విపక్ష సభ్యులను సస్పెండ్ చేస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు, నవంబర్ 29న రాజ్యసభలోని 12మంది విపక్ష ఎంపీలపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పాల్గొనకుండా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు నిషేధం విధించిన విషయం తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల్లో వీరు ప్రవర్తించిన తీరు అభ్యంరకమని పేర్కొంటూ ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు.
అయితే శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ అంశంపై విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. ఎంపీల సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమయంలోనే మరో విపక్ష ఎంపీని సస్పెండ్ చేయడంతో విపక్షాలు కేంద్రంపై మండిపడుతున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన పలు బిల్లులను వ్యతిరేకిస్తూ విపక్షాల సభ్యులు పార్లమెంటు ఉభయసభల్లోనూ ఆందోళనలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications