మళ్లీ నోరు జారారు: వరస హత్యలను కూడా ఎంజాయ్ చేయాలన్న త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇరుక్కున్నారు. ఈ మధ్యకాలంలో వాట్సాప్లో వస్తున్న ఫేక్ మెసేజ్లతో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. త్రిపురలో కూడా ఇదే తరహా వరస ఘటనలు జరిగాయి. దీంతో ఢిల్లీలో ఉన్న త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ను మీడియా ప్రతినిధులు కొన్ని ప్రశ్నలు వేశారు. రాష్ట్రంలో జరుగుతున్న వరస హత్యలపై మీ సమాధానమేంటి అని అడిగారు. ప్రస్తుతం త్రిపురాలో సంతోషం ఆనందం రాజ్యమేలుతున్నాయని చెప్పిన బిప్లవ్ దేవ్... వీటిని కూడా ఎంజాయ్ చేయాలి అనే తలతిక్క సమాధానం చెప్పారు. అంతేకాదు తాను ఎంత సంతోషంగా ఉన్నానో... తన ముఖం చూస్తే తెలుస్తుంనది చెప్పారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి.
సీఎం చేసిన వ్యాఖ్యలపై త్రిపుర ప్రభుత్వం నాలుక కర్చుకుని బిప్లవ్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. సీఎం మరో సందర్భాన్ని గురించి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకొచ్చింది. త్రిపురలో ఎయిర్పోర్ట్కు మహారాజా బీర్ బిక్రమ్ మాణిక్య కిషోర్ పేరు పెట్టడంపై చాలా సంతోషంగా ఉన్నారని ఆయన అదే మూడ్ నుంచి ఇంకా తేరుకోలేదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని చేసిన వ్యాఖ్యలను పత్రికలు వక్రీకరించాయని స్పష్టం చేసింది.
త్రిపురలా గత వారంరోజుల్లో ముగ్గురు వ్యక్తులు వాట్సాప్ రూమర్లకు బలయ్యారు. ఇలాంటి ప్రచారాలను నమొద్దంటూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వయంగా ప్రభుత్వం నియమించిన వ్యక్తినే స్థానికులు కొట్ి చంపడం కలకలం రేపుతోంది. ఉత్తర్ ప్రదేశ్కు చెందిన వస్త్ర వ్యాపారి బట్టలను అమ్మేందుకు త్రిపురకు రాగా...పిల్లలను ఎత్తుకపోయే కిడ్నాపర్గా భావించి స్థానికులు కొట్టి చంపారు.