భారత చమురు సంస్థల కీలక నిర్ణయం..! అమెరికా, ఈయూ షాకుల వేళ..!
రష్యా చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్దానికి ఆజ్యం పోస్తున్నామనే కారణంతో భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాలు విధించి షాక్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా భారత్ కు చమురు సరఫరా చేస్తున్న రష్యా చమురు సంస్థలపై ఆంక్షల కొరడా విధించారు. అనంతరం ఐరోపా దేశాల సమాఖ్య కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. దీంతో ఇన్నాళ్లు భారత్ కు ఏదో విధంగా డిస్కౌంట్ పై చమురు అమ్ముతున్న ఆయా సంస్థలకు భారీ షాకులు తగిలాయి.
ఈ నేపథ్యంలో భారత్ పై ఒత్తిడి అంతకంతకూ తీవ్రమవుతోంది. మరోవైపు భారత్ రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో ఎట్టి పరిస్ధితుల్లో వెనక్కి తగ్గేది లేదని ఇన్నాళ్లూ ప్రకటిస్తూ వస్తోంది. అయితే తాజాగా రూటు మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా భారతీయ చమురు రిఫైనరీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా రష్యా చమురు కొనుగోళ్ల కోసం కొత్త ఆర్డర్లను నిలిపేశాయి. ప్రభుత్వం, చమురు సంస్థల నుంచి క్లారిటీ వచ్చాకే కొత్త ఆర్డర్లు ఇచ్చే అవకాశం ఉంది.

ఉక్రెయిన్ తో యుద్దం చేస్తున్న రష్యాపై అమెరికా, బ్రిటన్ తో పాటు పలు యూరప్ దేశాలు ఆంక్షలు విధించాయి. రష్యా చమురు సంస్థలు లూక్ ఆయిల్, రోజ్ నెఫ్ట్ లపై ఆయా దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో ఆయా సంస్థల నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్న భారతీయ చమురు సంస్థలు ఆలోచనలో పడ్డాయి. అందుకే కేంద్రం నుంచి క్లారిటీ వచ్చే వరకూ కొత్త ఆర్డర్లను నిలిపేసినట్లు తెలుస్తోంది.దీనిపై కేంద్రం ఇచ్చే సంకేతాన్ని బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది.

ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో భారత్ రోజుకు రష్యా చమురు సంస్థల నుంచి రోజుకు 1.9 బ్యారెళ్ల క్రూడాయిల్ ను కొనుగోలు చేసింది. ఇది రష్యా చమురు ఎగుమతుల్లో 40 శాతం. అయితే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ మాత్రం ఇందులో 8.4 శాతం కొనుగోళ్లను తగ్గించుకుంది. దీనికి కారణం తగ్గుతున్న డిస్కౌంట్. ఈ సమయంలో భారతీయ చమురు సంస్థలు మధ్య ఆసియా దేశాలు, అమెరికా నుంచి చమురు కొనుగోలు చేశాయి. రష్యా చమురు కొనుగోళ్లు తగ్గించుకుంటే సుంకాలు తగ్గిస్తామని అమెరికా నుంచి వస్తున్న ఆఫర్లతో ఆ దిశగా చమురు సంస్థలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రష్యాకు షాకులు తప్పవు.












Click it and Unblock the Notifications