ఏనాటికైనా నిజమే గెలుస్తుంది: తీర్పుపై లాలూ ట్వీట్లు, రాంచీ జైలుకు తరలింపు, అసలేంటీ కేసు?
దాణా కుంభకోణం కేసులో రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు అనంతరం బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కవితాత్మక ధోరణిలో ట్వీట్ చేశారు.
రాంచీ: దాణా కుంభకోణం కేసులో రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు అనంతరం బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కవితాత్మక ధోరణిలో ట్వీట్ చేశారు.
''ఒక్కోసారి నిజం కూడా అబద్ధంలాగే కనిపిస్తుంది.. పక్షపాతంతో కూడి ప్రచారం వల్ల నిప్పులాంటి నిజం కూడా ఒక్కోసారి అస్పష్టంగా, అబద్ధంగా కనిపిస్తుంది. కానీ పక్షపాతం, ద్వేషం పొరలు తొలగిపోతాయి.. చివరికి గెలిచేది నిజమే..'' అని ఆయన తన ట్వీట్లలో పేర్కొన్నారు.
అంతేకాదు, ''నిజం చెప్పులేసుకునే లోపే.. అబద్ధం సగం ప్రపంచాన్ని చుట్టి వస్తుందని, కానీ చివరికి గెలిచేది న్యాయమే..'' అని కూడా లాలూ ప్రసాద్ యాదవ్ ట్వీట్ చేశారు. మరోవైపు కోర్టు తీర్పు నేపథ్యంలో సీబీఐ అధికారులు ఇప్పటికే లాలూను తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన్ని బిర్సాముండా సెంట్రల్ జైలుకు తరలిస్తున్నట్లు సమాచారం.
రెండు దశాబ్దాల కేసులో సంచలన తీర్పు...
బీహార్లో రెండు దశాబ్దాల క్రితం వెలుగు చూసిన దాణా కుంభకోణం కేసులో రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శనివారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులైన బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్తో పాటు మరో 15 మందిని దోషులుగా తేల్చింది. అలాగే, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథమిశ్రా సహా మరో ఐదుగురిని నిర్దోషులుగా న్యాయస్థానం ప్రకటించింది. దోషులకు జనవరి 3న శిక్షలు ఖరారు చేయనుంది.
అసలేంటి దాణా కుంభకోణం కేసు?
1991 నుంచి 1997 మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఈ దాణా కుంభకోణం 1997లో వెలుగులోకి వచ్చింది. పశువుల దాణా కొనుగోళ్ల పేరుతో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి లాలూ సహా మరికొందరిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. తన భార్య రబ్రీ దేవిని సీఎంను చేశారు.
మొత్తం 5 కేసుల నమోదు...
ఈ దాణా కుంభకోణానికి సంబంధించి లాలూపై మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకటైన చైబాసా కోశాగార కేసులో ఇప్పటికే లాలూ దోషిగా తేలారు. ఈ కేసులో ఆయనను దోషిగా తేలుస్తూ 2013లోనే న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఐదేళ్ల పాటు జైలు శిక్ష కూడా విధించింది. అంతేకాదు.. లాలూ ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ ఆరేళ్ల పాటు నిషేధం కూడా విధించింది. ఆ సమయంలో రెండున్నర నెలల పాటు జైల్లో ఉన్న లాలూ.. ఆ తర్వాత బెయిల్పై బయటికొచ్చారు.
తాజా తీర్పు.. దేవగఢ్ కోశాగార కేసులో...
శనివారం నాటి తీర్పు దేవగఢ్ కోశాగార కేసుకు సంబంధించినది. 1991 నుంచి 1994 మధ్య ఈ ఖజానా నుంచి రూ.89.27 లక్షలు పశుదాణా పేరుతో స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసులో 38 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే విచారణ సమయంలోనే వీరిలో 11 మంది మృతి చెందగా, మరో ముగ్గురు అప్రూవర్గా మారారు. ఇంకో ఇద్దరు నేరాన్ని అంగీకరించడంతో 2006లో వారికి శిక్ష విధించారు. తాజాగా మిగిలిన 22 మందిపై విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేక కోర్టు లాలూ సహా 15 మందిని దోషులుగా తేల్చింది.
న్యాయస్థానం వద్ద భారీ బందోబస్తు...
ఈ కేసు విచారణ సందర్భంగా లాలూతో పాటు ఆయన కుమారుడు తేజస్వియాదవ్ కూడా రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వద్దకు చేరుకున్నారు. ఈ కేసు తీర్పులో తీవ్ర ఉత్కంఠత నెలకొనడంతో ఆర్జేడీ మద్దతుదారులు, భారీ సంఖ్యలో ప్రజలు కూడా తరలివచ్చారు. దీంతో పోలీసులు న్యాయస్థానం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. సీబీఐ జడ్జి శివపాల్ సింగ్ శనివారం కిక్కిరిసిన కోర్టు హాలులో తీర్పును చదివి వినిపించారు.
తీర్పు ఒక రాజకీయ ఎత్తుగడ మాత్రమే...
దాణా కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఓ రాజకీయ ఎత్తుగడ మాత్రమేనని లాలూ ప్రసాద్ పార్టీ ఆర్జేడీ కూడా మండిపడుతోంది. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారని, న్యాయం కోసం తాము హైకోర్టుకు వెళ్తామంటూ పేర్కొంది. అంతకుముందు తీర్పుపై లాలూ ప్రసాద్ యాదవ్ స్పందిస్తూ.. బీజేపీ డర్టీ గేమ్ ఆడుతుందని విమర్శల వర్షం కురిపించారు. కోర్టు తీర్పు ఏకపక్షంగా ఉందని.. న్యాయకోసం తమ పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఇక మీ అంతం ప్రారంభమైంది..
రాంచీ కోర్టు తీర్పుపై ఆర్జేడీ నేత మనోజ్ ఝా కూడా విమర్శలు గుప్పించారు. ‘‘న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకముంది.. కానీ ఈ కేసులో మేము అందజేసిన సాక్ష్యాన్ని పరిగణనలోనికి తీసుకోలేదు.. దీనిపై మేం హైకోర్టులో అప్పీల్ చేస్తాం..'' అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ‘‘బీహార్లో అధికార పార్టీ రాజకీయ క్రీడ సాగుతోంది.. నయానో, భయానో ప్రతిపక్షాన్ని లొంగదీసుకోవాలనేది వారి ప్రయత్నం. ఇలాంటి వాళ్లకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా.. మీ అంతం ప్రారంభమైంది..'' అని మనోజ్ ఝా పేర్కొన్నారు.
Truth can be made to appear as a lie, as ambiguous or a half lie by concerted onslaught of bias driven propaganda. But blurred layer of bias and hatred will still be removed, come what may! In end Truth will win
— Lalu Prasad Yadav (@laluprasadrjd) December 23, 2017
A lie can travel half way around the world while the truth is putting on its shoes. ....But still prevails...In the end though.
— Lalu Prasad Yadav (@laluprasadrjd) December 23, 2017
#WATCH: Lalu Prasad Yadav outside Ranchi's Special CBI Court after being convicted in a #FodderScam case pic.twitter.com/hn6REkaizv
— ANI (@ANI) December 23, 2017