ప్రధాని మోదీ దిగ్భ్రాంతి: కొవిడ్తో జర్నలిస్ట్ రోహిత్ సర్దానా మృతిపై విచారం -అమిత్ షా, టాప్ నేతలు కూడా
''రోహిత్ సర్దానా చాలా త్వరగా మనల్ని విడిచి వెళ్లారు. దేశ పురోగతిపై శక్తిమంతమైన గొంతుక వినిపించిన ఆయన, వ్యక్తిగతంగానూ దయార్థ హృదయుడు. నాతోపాటు చాలా మంది ప్రజలు టీవీలో ఆయన్ని మిస్ అవుతాం. రోహిత్ సర్దానా మృతి మీడియా ప్రపంచంలో పూడ్చలేని వెలితి. ఆయన కుటుంబం, స్నేహితులు, అభిమానులకు నా సంతాపం. ఓం శాంతి..'' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక ట్విటర్ లో కీలక ప్రకటన చేశారు.
దేశంలో మోస్ట్ పాపులర్ టీవీ జర్నలిస్టుల్లోఒకరు, ఆజ్ తక్ హిందీ న్యూస్ చానెల్ లో 'దంగల్' చర్చా కార్యక్రమ నిర్వాహకుడు రోహిత్ సర్దానా శుక్రవారం కన్నుమూశారు. ఇటీవల కొవిడ్ వ్యాధి బారిన పడిన ఆయన గుర్గావ్ లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స తీసుకుని క్రమంగా కోలుకుంటున్న క్రమంలో అనూహ్యంగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. చనిపోయేనాటికి ఆయన వయసు 42ఏళ్లు మాత్రమే.

టీవీ జర్నలిస్ట్ రోహిత్ సర్దానా మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ముఖ్యనేతలు సైతం విచారం వ్యక్తం చేశారు. ''రోహిత్ సర్దానా అకాలమరణం ఎంతగానో బాధించింది. పక్షపాతంలేని రిపోర్టింగ్ చేసే ఆయన మరణంతో దేశం ఓ ధైర్యవంతుడైన జర్నలిస్టును కోల్పోయినట్లయింది. ఈ కష్టకాంలో ఆయన కుటుంబానికి దేవుడు తోడుండాలని ప్రార్థిస్తున్నా'' అని అమిత్ షా ట్వీట్ చేశారు.

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కిరణ్ రిజుజు సహా ఇంకొందరు కేంద్ర మంత్రులు, బీజేపీ టాప్ నేతలు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా తదితరులు సైతం రోహిత్ సర్దానా మృతి పట్ల సంతాపాలు తెలిపారు. తొలుత జీ న్యూస్, ప్రస్తుతం ఆజ్ తక్ చానల్ లో పనిచేసిన సర్దానా 2018లో గణేష్ విద్యా పురస్కరాన్ని అందుకున్నారు. మోదీ, బీజేపీలకు బాకా ఊదే 'గోదీ మీడియా'లో రోహిత్ సర్దానాను ప్రముఖుడిగా విమర్శకులు భావిస్తారు.












Click it and Unblock the Notifications