100 రోజుల పాలన నాడు సీఎం విజయ్ బిగ్ ప్లాన్: ట్రెండ్ సెట్
తమిళనాడులో దశాబ్దాల రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తూ నూతన అధ్యాయాన్ని సృష్టించిన టీవీకే ప్రభుత్వం త్వరలోనే 100 రోజుల మైలురాయిని అందుకోబోతోంది. ఈ నెల 17వ తేదీ నాటికి 100 రోజుల పాలనను పూర్తి చేసుకోబోతోంది. మే 10వ తేదీన ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సాధించిన విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ప్రభుత్వం ఓ క్షేత్రస్థాయి కార్యాచరణను రూపొందిస్తోంది.
ఈ 100 రోజుల ప్రస్థానంలో సాధించిన మార్పులను వివరిస్తూ ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని సీఎం విజయ్ అధికారులను ఆదేశించారు. ఈ బాధ్యతను అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులకు అప్పగించారు. ప్రతి శాఖ పరిధిలో తీసుకున్న నూతన నిర్ణయాలు, కొత్తగా జారీ చేసిన ఉత్తర్వులను కూడా సేకరిస్తోన్నారు. అధికారిక రికార్డులకు మాత్రమే పరిమితం కాకుండా, సాధారణ ప్రజలను సులభంగా ఆకట్టుకునేలా ప్రత్యేకంగా ఓ డాక్యుమెంటరీని విడుదల చేయనున్నారు అధికారులు.

చెన్నై సహా జిల్లాల కేంద్రాల్లో ఫొటో ఎగ్జిబిషన్ ను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. తమిళనాడు రాజకీయాల్లో సుమారు 60 ఏళ్లకు పైగా కొనసాగిన ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండి కొడుతూ టీవీకే సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అధికారం చేపట్టిన తక్కువ సమయంలోనే శాంతిభద్రతల రక్షణ కోసం ప్రవేశపెట్టిన సింగపెణ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్, పేదల కోసం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం, రాష్ట్రవ్యాప్తంగా 717 టాస్మాక్ మద్యం దుకాణాల మూసివేత వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది టీవీకే ప్రభుత్వం.
ఈ విజయాలనే ఈ వంద రోజుల డాక్యుమెంటరీలో హైలైట్ చేయనున్నారు. రైతులకు సాయం చేయడంలో భాగంగా రూ.134 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని అమలులోకి తీసుకుని రావడం, పంట రుణాల పాక్షిక రుణమాఫీ వంటి నిర్ణయాలను ఇందులో చేర్చారు. పేదల ఆకలి తీర్చే అమ్మ క్యాంటీన్లకు నిధులు కేటాయించి వాటిని పునర్వ్యవస్థీకరించిన విషయాన్నీ ప్రజలకు తెలియజేయనున్నారు. ప్రభుత్వ శాఖలలో అవినీతి నిరోధానికి గట్టి చర్యలు చేపట్టారు.
భూ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కీలక మార్పులు, భారీగా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడం వంటి విధానాలను వంద రోజుల విజయాల రిపోర్టులో విశ్లేషించనున్నారు. ఈ 100 రోజుల పాలనా ఉత్సవాలను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కోలీవుడ్ నటీనటులు, దర్శకులు, మ్యూజిక్ కంపోజర్లు, ఇతర టెక్నీషియన్లతో ప్రత్యేక వీడియోలు కూడా చిత్రీకరిస్తోన్నారు. వీటన్నింటినీ విజయ్ స్వయంగా విడుదల చేయనున్నారు.
ప్రతి శాఖలోనూ తీసుకొచ్చిన విధానపరమైన మార్పులు, ప్రజోపయోగ నిర్ణయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదని, వాటన్నింటినీ కూడా డాక్యుమెంటరీ, పుస్తక రూపంలో తీసుకుని రావాలని ముఖ్యమంత్రి కార్యాలయం.. ఆయా శాఖలు, విభాగాధిపతులను ఆదేశించింది. ప్రస్తుత పాలనపై, సాధించిన ఫలితాలపై మహిళలు, రైతులు, యువత, నిరుద్యోగులు.. ఇలా వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించనున్నారు అధికారులు.




Click it and Unblock the Notifications