ఎవరితో పెట్టుకోకూడదో..వారితోనే: ఏకంగా ఐటీ మంత్రి అకౌంట్ను బ్లాక్ చేసిన ట్విట్టర్: తరువాత
న్యూఢిల్లీ: కొంతకాలంగా దేశంలో వివాదాలకు కేంద్రబిందువు అవుతూ వస్తోన్న టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్.. ఊహించని చర్యకు దిగింది. ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే పెట్టుకుంది. ఏకంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అకౌంట్ను బ్లాక్ చేసి పడేసింది. సుమారు గంటకు పైగా దాన్ని నిషేధించింది. దీనితో తన ట్విట్టర్ అకౌంట్ను యాక్సెస్ చేయలేకపోయానని రవిశంకర్ ప్రసాద్ చెప్పుకొచ్చారు. తన కూ (KOO) అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
కేసీఆర్తో వైఎస్ జగన్ ఫేస్ టు ఫేస్కు రెడీ: జనం సెంటిమెంట్ను రెచ్చగొట్టలేం: ఏపీ మంత్రి
ఆ తరువాత ట్విట్టర్ యాజమాన్యం నాలిక్కరచుకున్నట్టు కనిపించింది. ఆయన అకౌంట్ను రీస్టోర్ చేసింది. దేశంలో ప్రస్తుతం ట్విట్టర్ యాజమాన్యం నిషేధాన్ని ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ రూపొందించిన కొత్త మార్గదర్శకాలు, నిబంధనలకు లోబడి తాము కార్యకలాపాలను కొనసాగిస్తామని డిక్లరేషన్ ఇవ్వకపోవడం, దానికి అనుగుణంగా చర్యలు చేపట్టడంలో జాప్యం ఏర్పడటం వల్ల ట్విట్టర్ యాజమాన్యం మెడపై ప్రస్తుతం కత్తి వేలాడుతోంది.
ఇది ఎప్పుడు తెగి పడుతుందో తెలియదు. ఇప్పటికే రెండుసార్లు తుది నోటీసులను కూడా అందుకుంది ట్విట్టర్ యాజమాన్యం. ఈ పరిస్థితుల్లో ట్విట్టర్ యాజమాన్యం అనూహ్య చర్యకు దిగింది. ఈ మార్గదర్శకాలను రూపొందించింది, వాటికి లోబడి ఉండాలంటూ ట్విట్టర్ మేనేజ్మెంట్కు నోటీసులను జారీ చేసిందీ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖే. ఈ శాఖకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న సాక్షాత్తూ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అకౌంట్నే బ్యాన్ చేసి పడేసింది ట్విట్టర్ యాజమాన్యం. గంట దాటిన తరువాత దాన్ని పునరుద్ధరించింది.
తన ట్విట్టర్ అకౌంట్ను యాక్సెస్ చేయలేకపోతోన్నానంటూ రవిశంకర్ ప్రసాద్ కొద్దిసేపటి కిందటే కూ ద్వారా మెసేజ్ ఇచ్చారు. అమెరికాలో అమల్లో ఉన్న డిజిటల్ మిల్లేనియం కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించడం వల్ల అకౌంట్ను తాత్కాలికంగా నిషేధించినట్లు ట్విట్టర్ నుంచి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. సుమారు గంట తరువాత దాన్ని పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. అసలే మెడపై కత్తి వేలాడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తాజాగా తీసుకున్న ఈ చర్య ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది ఆసక్తిగా మారింది.
దీనిపై రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియేటరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) చట్టం 2021లోని రూల్ 4 (8)ను ట్విట్టర్ యాజమాన్యం ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు. ఎలాంటి ముందస్తు నోటీసు గానీ, సమాచారం గానీ ఇవ్వకుండా తన సొంత అకౌంట్లోకి తన యాక్సెస్ చేయనివ్వకపోవడం ఈ నిబంధనను ఉల్లంఘించినట్టుగా చెప్పారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.