ఒకప్పుడు సాదాసీదాగా బతికారు... ఏడేళ్లలో కోట్లకు పడగలెత్తారు. ఇంతకీ ఎలా సంపాదించారో తెలుసా?
భోపాల్ : కాదేదీ కల్తీకనర్హం అన్నట్లు తయారైంది ప్రస్తుతం పరిస్థితి. తినే తిండి నుంచి తాగే పాల వరకు సర్వం కల్తీమయమైపోయాయి. అలాంటి కల్తీ పాల వ్యాపారం చేసే ఇద్దరు అన్నదమ్ములు ఏడేళ్లుగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ కోట్లు సంపాదించారు. అయితే పాపం పండి వారి బండారం బయటపడింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కి ప్రస్తుతం శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరుకున్నారు.
కోట్లకు పడగలెత్తిన అన్నదమ్ములు
మధ్యప్రదేశ్ మోరేనా జిల్లాకు చెందిన దేవందర్, జైవీర్లు అన్నదమ్ములు. పేద కుటుంబం. ఏడేళ్ల క్రితం వారు దగ్గరలోని డెయిరీకి పాలు సప్లై చేసేవారు. ఆదాయం అంతంత మాత్రమే కావడంతో బతుకు బండిని భారంగా లాగేవారు. అయితే ఇప్పుడు వారి దశ తిరిగి పోయింది. ఒకప్పుడు సాదాసీదాగా బతికిన కుటుంబం ఏడేళ్లు గడిచేసరికి కోట్లకు పడగలెత్తారు. 2కోట్ల విలువైన మిల్క్ చిల్లింగ్ ప్లాంట్కు ఓనర్లు అయ్యారు. అంతేకాదు.. మిల్క్ ట్యాంకర్లు, మూడు బంగ్లాలు, ఎస్యూవీ కార్లు, వ్యవసాయ భూమి వారి సొంతమయ్యాయి.
సింథటిక్ పాలుు విక్రయించి
అన్నదమ్ములకు ఏదో లాటరీ దొరికిందేమో అనుకుంటే పొరపాటే. వాళ్లు పాల వ్యాపారం చేస్తూనే కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టారు. అయితే దీనిపై ఫిర్యాదు అందడంతో మధ్యప్రదేశ్ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. తీగలాగితే డొంక కదిలింది. ఎస్టీఎఫ్ విచారణలో అన్నదమ్ములిద్దరూ సింథటిక్ పాలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ కోట్లు వెనకేసుకున్నట్లు తేలింది. గ్లూకోజ్, యూరియా, రిఫైన్డ్ ఆయిల్, మిల్క్ పౌడర్, నీళ్లు, ఇతర హైడ్రోజన్ పెరాక్సైడ్ తదితర కెమికల్స్ ఉపయోగించి దేవందర్, జైవీర్లు పాలు తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. జనంపై స్లో పాయిజన్లా పనిచేసే ఈ పాల అమ్మకం ద్వారానే అన్నదమ్ములు భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు తేలింది..
ఆరుగురిపై కేసు నమోదు
లీటర్ సింథటిక్ పాలు తయారీకి రూ.6 ఖర్చవుతుండగా.. హోల్ సేల్ మార్కెట్లో దాన్ని రూ.25కు విక్రయిస్తున్నారు. దీంతో లీటర్పై 70 నుంచి 75 లాభం వస్తోంది. దేవందర్, జైవీర్తో పాటు చంబల్ ప్రాంతంలో మరికొందరు డెయిరీ ఓనర్లు సైతం సింథటిక్ పాలు తయారుచేస్తున్నట్లు ఎస్టీఎఫ్ పోలీసుల విచారణలో తేలింది. మధ్యప్రదేశ్లోనే కాక హర్యానా, ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్లోనూ బడా కంపెనీలు సైతం ఇదే తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దేవందర్, జైవీర్తో కలిపి మొత్తం ఆరుగురిపై ఐపీసీ సెక్షన్ 420, ఆహారకల్తీ నియంత్రణ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. వారి అక్రమార్జన విషయాన్ని ఇన్కం టాక్స్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఎస్టీఎఫ్ అధికారులు చెప్పారు.