రెండు వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకున్నా ప్రమాదం ఏమీలేదు, కానీ: కేంద్రం క్లారిటీ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియలో జరుగుతున్న పొరపాట్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తొలి డోసు ఒకటి, రెండో డోసు వేరే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో తీవ్ర దుష్ప్రబావాలు కనిపించడం లేదని స్పష్టం చేసింది. అయితే, ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఆరోగ్య సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.
రెండు వేర్వేరు వ్యాక్సిన్లు వేయడం అనేది పరిశీలించాల్సిన విషయం. దీనిపై శాస్త్రీయ అవగాహన కోసం మరింత సమయం వేచిచూడాలి. కానీ, ఇలా వేర్వేరు టీకాలు తీసుకున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యశాఖ) డాక్టర్ వీకే పాల్ తెలిపారు. తీవ్ర ప్రతికూల ప్రభావాలు సంభవించకపోవచ్చని, అయినప్పటికీ వీటిని పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆరోగ్య సిబ్బంది జాగ్రత్త వహించాలన్నారు.
నిబంధనల ప్రకారం.. తొలి డోసు తీసుకున్న వ్యాక్సినే రెండో డోసులో ఇవ్వాలని పాల్ స్పష్టం చేశారు. కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధార్థ్ నగర్లో ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి రెండో డోసుకు వచ్చిన వారికి తొలి డోసులో వేసిన వ్యాక్సిన్ కాకుండా వేరేది ఇచ్చారు.
Recommended Video
తొలుత కోవిషీల్డ్ తీసుకున్న 20 మందికి రెండో డోసులో కోవాగ్జిన్ ఇచ్చారు. ఆ తర్వాత పొరపాటును గుర్తించిన అధికారులు.. అలా తీసుకున్న వారిని ప్రత్యేక పరిశీలనలో ఉంచారు. అయితే, వారిలో ఇప్పటి వరకు ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించడం లేదని అధికారులు తెలిపారు. మరోవైపు ఇలా వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకోవడంపై అంతర్జాతీయంగానూ పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఫైజర్, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్లపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రయోగాలు జరుపుతోంది. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలో ఎలాంటి దుష్ప్రభావాలు బయటపడనప్పటికీ.. పూర్తి ఫలితాలు మరింత సమయం పడుతుందని చెబుతున్నారు.