మైనర్పై రేప్: ఇద్దరిని నగ్నంగా ఊరేగిస్తూ చితకబాదారు
ఇటానగర్: ఉన్నత పాఠశాల విద్యార్థినిపై అత్యాచారం చేశారనే ఆరోపణపై ఇద్దరు వ్యక్తులను ఓ గుంపు నగ్నంగా ఊరేగిస్తూ చితకబాదింది. ఈ సంఘటన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సియాంగ్ జిల్లాలో జరిగింది.
ఇద్దరిని నగ్నంగా ఊరేగిస్తూ చితకబాదినవారిలో మహిళలు కూడా ఉన్నారు. ఈ సంఘటన మార్చి 26వ తేదీన జరిగింది. ఆ తర్వాత ఆ ఇద్దరిని పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
మార్చి 25వ తేదీన నిర్మాణంలో ఉన్న గాంధీ వంతెన వద్ద 17 ఏళ్ల అమ్మాయిపై ఆమె స్నేహితుడితో పాటు నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు డిఐజి (సెంట్రల్ రేంజ్) జాన్ నిహాలయిా చెప్పారు.
యింగ్కియాంగ్ పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో రాత్రి 8.30 గంటల ప్రాంతంలో సంఘటన జరిగింది. మర్నాడు పోలీసులకు ఆ విషయంపై సమాచారం అందింది. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు డిఐజి చెప్పారు.
సంఘటన దురదృష్టకరమని రాష్ట్ర హోం మంత్రి కుమార్ వాయి అన్నారు. అపరిచితులతో తెలియని ప్రాంతాలకు వెళ్లకూడదని, రాత్రి పూట ప్రయాణించకూడదని ఆయన మైనర్లకు సలహా ఇచ్చారు.