‘సబ్ కా సాత్..’’నినాదం ప్రపంచానికీ వర్తిస్తుందన్న ప్రధాని మోదీ.. ప్రతిష్టాత్మక ‘ఎకోసాక్’లో ప్రసంగం.
''కొవిడ్-19 వ్యతిరేక పోరాటంలో భారత్ ప్రపంచ దేశాలకు బాసటగా నిలిచింది. 150 దేశాలకు మందులు, ఇతర వైద్య సామాగ్రిని అందించాం. దేశీయంగా సుస్థిర అభివృద్ధి కోసం లక్ష్యాలను అజెండాను రూపొందించుకోవడమేకాదు, అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలకు కూడా మద్దతుగా భారత్ నిలబడింది. కరోనా మహమ్మారి సవాళ్లు విసురుతోన్న ప్రస్తుత సందర్భంలో బహుళత్వం అవసరం మరింత పెరిగింది. ఐక్యరాజ్యసమితిలో, మరీ ప్రధానంగా ఆర్థిక, సామాజిక మండలి(ఎకోసాక్)లో భారత్ తొలి నుంచీ చురుకుగా వ్యవహరిస్తున్నది. ఎకోసాక్ తొలి అధ్యక్షుడు భారతీయుడు కావడం గర్వకారణం. ఇండియాలో మేం 'సబ్ కా సాత్.. సబ్ కా వికాస్' నినాదంతో ముందుకు వెళుతున్నాం. ప్రస్తుతం ఇది ప్రపంచానికి కూడా వర్తిస్తుంది '' అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్యసమితి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన 50 దేశాల్లో ఇండియా కూడా ఒకటని, ఇవాళ అది 193 దేశాల కూటమిగా వృద్ధి చెందిందని మోదీ గుర్తుచేశారు. ప్రస్తుతం బహుళత్వ విధానం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నదన్నారు. యూనియన్ల అభివృద్ధికి, ఎకోసాక్ ముదడుగుకు భారత్ ఎనలేని కృషి చేయిందని చెప్పారు. కరోనా మహమ్మారి ప్రపంచదేశాలకు సవాళ్లు విసిరిందని, భారత్ లో కోరానాపై పోరును ప్రజాయుద్ధంగా మలచడంలో సఫలీకృతులయ్యామని తెలిపారు.
ఐక్యరాజ్యసమితి ఆర్థిక,సామాజిక మండలి(ఎకోసాక్) వార్షిక సదస్సును ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రసంగించారు. ఈ ఏడాదికిగానూ ''కొవిడ్-19 తర్వాత బహుళత్వం: 75వ వార్షికోత్సవం నాటికి ఐక్యరాజ్యసమితి ఎలా ఉండాలి'' అనే థీమ్ పై నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. వర్చువల్ విధానంలో నిర్వహించిన ఎకోసాక్ సదస్సు ముగింపు సందర్భంగా యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, నార్వే ప్రధాని ఎర్నా సోల్బర్గ్ తోపాటు ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కొవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, అంతర్జాతీయంగా మారిన సంబంధాల నేపథ్యంలో మల్టీలాట్రలిజం(బహుళత్వాన్ని) ఎలా తీర్చిదిద్దాలనేదానిపై నేతలు సమాలోచనలు చేశారు. రెండేళ్ల కాలానికి (2021-22) భారత్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో తాత్కాలిక సభ్యత్వానికి ఎన్నికైన తర్వాత ఐరాసలో మోదీ చేసిన తొలి ప్రసంగం ఇదే కావడం గమనార్హం. మోదీ చివరిసారిగా 2016 సదస్సులో మాట్లాడారు. ఎకోసాక్ తొలి సమావేశానికి(1946లో) మన దేశానికే చెందిన సర్ రామస్వామి మొదలియార్ అధ్యక్షత వహించడం గమనార్హం.