uttarakhand Tunnel: ఉత్తరాఖండ్ సొరంగంలో 40 మంది కార్మికులు-పైపులతో ఆక్సిజన్, ఆహారం..
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం మధ్యలో కుప్పకూలింది. దీంతో అందులో పనిచేస్తున్న 40 మంది కార్మికులు చిక్కుకుపోయారు. సొరంగం రాళ్లు వారి మీద పడటంతో వారంతా అందులో ఇరుక్కుపోయారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నా సొరంగం రాళ్లు మీడ పడే ప్రమాదం పొంచి ఉంది. దీంతో సొరంగంలో చిక్కుకున్న వారికి ఓ పైపు ద్వారా ఆహారం, ఆక్సిజన్ అందించాల్సిన పరిస్దితి ఎదురవుతోంది.
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లాలో యమునోత్రి జాతీయ రహదారిపై సిక్యారా-దండల్గావ్ మధ్య నిర్మాణంలో ఉన్న ఉన్న ఓ సొరంగం మధ్యలో కుప్పకూలింది. నిన్న చోటు చేసుకున్న ఈ ఘటనలో ఈ సొరంగంలో పనులు చేస్తున్న 40 మంది కార్మికులు చిక్కుకుపోయారు. దీంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కేంద్రం సాయం కోరింది. వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రస్తుతం సహాయ చర్యల్లో నిమగ్నమవుతున్నాయి. సొంరంగంలో చిక్కుకుపోయిన వారికి ఆక్సిజన్ కూడా అందే పరిస్దితి లేకపోవడంతో పైపు ద్వారా ఆక్సిజన్ పంపుతున్నారు. అలాగే ఆహారం కూడా ఇదే పైపులైన్ లో పంపుతున్నారు.

సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులతో మాట్లాడుతున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఇప్పటికే సొరంగంలోకి 15 మీటర్ల మేర ప్రవేశించామని, మరో 35 మీటర్లు లోపలికి వెళ్లాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం సొరంగంలో ఉన్న వారంతా సురక్షితంగానే ఉన్నట్లు నిర్ధారించారు. అలాగే సొరంగంలోకి ప్రవేశించేందుకు ఇతర మార్గాల్ని కూడా అన్వేషిస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోడీ.. సొంరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఉత్తరాఖండ్ కు అన్నివిధాలా సహకారం అందిస్తామన్నారు.
ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ తో పాటు పోలీసులు, స్ధానిక ప్రభుత్వ అధికారులు కూడా సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యారు.ఈ ఆపరేషన్లో 13 మీటర్ల వెడల్పు సొరంగం లోపల చెత్తను తొలగించడానికి రెండు జేసీబీలు, ఒక పోక్లెయిన్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. చిక్కుకున్న కార్మికులను చేరుకోవడానికి మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఇవాళ సాయంత్రానికి దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications