Budget 2023 highlights: ఈ ఏడాది ఎన్నో ప్రత్యేకతలు- కొత్తగా ప్రవేశపెట్టినవి ఇవే..!!
కేంద్ర ఆర్థిఖ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఇవ్వాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రశంసలు అందుతున్నాయి. దేశ ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ, రక్షణ శాఖకు భారీగా నిధులను కేటాయించడాన్ని నిపుణులు స్వాగతిస్తో
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. వేతన జీవులకు ఊరట కల్పించడం హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఈ ఉదయం సరిగ్గా 11 గంటలకు ఆమె పార్లమెంట్ లో తన బడ్జెట్ ప్రసంగాన్ని మొదలు పెట్టారు. సుమారు గంటన్నర పాటు ఏకధాటిగా కొనసాగించారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలను బీజేపీ నాయకులు స్వాగతిస్తోండగా.. ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తోన్నాయి. అంశాలవారీగా లోపాలను ఎత్తి చూపుతున్నాయి.
వేతన జీవులకు ఊరట కల్పించారు నిర్మల సీతారామన్. వార్షిక ఆదాయం మూడు లక్షల రూపాయల వరకు ఉన్న వారిని పన్ను చెల్లింపుల నుంచి మినహాయింపునిచ్చారు. రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారిపై 5, 6 నుంచి 9 లక్షల వరకు 10 శాతం, రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం పన్ను విధించారు. రూ.15 లక్షల వార్షికాదాయం దాటిన వారిపై 30 శాతం పన్ను విధించారు.
మౌలిక రంగానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. 10 లక్షల కోట్ల రూపాయల మేర బడ్జెట్ దీనికి కేటాయించింది. 2014తో పోల్చుకుంటే ఈ సంఖ్య 400 శాతం అధికం. రక్షణ మంత్రిత్వ శాఖకూ అదే స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చింది. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో 5.94 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించింది. గతంతో పోల్చుకుంటే డిఫెన్స్ సెక్టార్ కు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల మొత్తం 13.31 శాతం ఎక్కువ. మొత్తం బడ్జెట్ లో 13 శాతం వాటా రక్షణ రంగానిదే.
రైల్వేలకూ సమాన ప్రాధాన్యతను ఇచ్చింది. విద్యుదీకరణ, డబ్లింగ్, ట్రిప్లింగ్, ఆధునికీకరణ, కొత్త కోచ్లు, వందే భారత్, బుల్లెట్ ట్రైన్స్ ను 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడానికి ఏకంగా 2.40 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది మరిన్ని వందే భారత్ రైళ్లను తీసుకుని రావడం ఖాయంగా కనిపిస్తోంది. వరుసగా మూడో ఏడాది కూడా మూలధన పెట్టుబడిలో 33 శాతం పెంచింది.
ఈ బడ్జెట్ లో కొత్తగా పలు పథకాలను ప్రతిపాదించింది. కొత్త పన్నుల విధానం, మహిళలకు ఆర్థిక స్వావలంబనను కల్పించడానికి ఉద్దేశించిన చిన్న మొత్తాల పొదుపు, నేషనల్ కోఆపరేటివ్ డేటా బేస్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు ప్రాధాన్యతను ఇచ్చే క్రమంలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఫర్ ఏఐ, 5జీ యాప్స్ అభివృద్ధి చేయడానికి 100 ల్యాబొరేటరీలు, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్, ఫైనాన్షియల్ ఇన్ఫో రిజిస్ట్రీ, ఫార్మాసూటికల్స్ రంగంలో పరిశోధన-అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రత్యేక ప్రణాళిక, దేశంలో కొత్తగా 157 నర్సింగ్ కళాశాలలు.. ఇవన్నీ బడ్జెట్ కు ప్రత్యేకతలను తెచ్చిపెట్టాయి.