Union Budget 2025: ఈసారి బడ్జెట్ లో ఐటీ కీలక మార్పులివే..! వేతన జీవులకు రిలీఫ్ ?
మరో వారం రోజుల్లో కేంద్ర బడ్టెట్ రాబోతోంది. ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ యథావిధిగా వచ్చే ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ శాఖల నుంచి అందిన ప్రతిపాదనలకు, తన ఆలోచనల్ని జోడించి బడ్జెట్ రూపంలో ముందుకొస్తున్నారు. అయితే ఈసారి బడ్జెట్ లో మిగతా ప్రతిపాదనల సంగతి ఎలా ఉన్నా వేతన జీవులకు మాత్రం నిర్మలమ్మ ఊరటనిస్తారని తెలుస్తోంది.
ముఖ్యంగా ఈసారి బడ్జెట్ లో ఆదాయపు పన్ను విషయంలో పలు మార్పులు చేసేందుకు నిర్మలమ్మ సిద్దమవుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈసారి కేంద్ర బడ్జెట్ ఉద్యోగ వర్గాలకు భారీ ఊరట ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపుతో పాటు కొత్త పన్ను స్లాబ్ లు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇప్పటికే పెరిగిన ఐటీ రిటర్న్ ల దాఖలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి బిజినెట్ స్టాండర్డ్ సేకరించిన వివరాల ప్రకారం చూస్తే.. ఈసారి ప్రస్తుతం ఉన్న కొత్త విధానంలో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని 7 లక్షల నుంచి 10 లక్షలకు పెంచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
అలాగే రూ.15 లక్షల నుండి రూ.20 లక్షల వరకు ఆదాయానికి కొత్త స్లాబ్ రేటు 25 శాతం నిర్ణయించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ అనుమతిస్తే ఈ రెండు నిర్ణయాలను అమలు చేయవచ్చని అధికారులు చెప్తున్నారు. ఈ నిర్ణయాలు అమలైతే మాత్రం ఆదాయపు పన్ను వసూళ్లలో కేంద్రం రూ.50 వేల కోట్ల నుండి లక్ష కోట్ల ఆదాయ నష్టాన్ని భరించాల్సి ఉంటుందని అంచనా.
కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో రూ.10 లక్షల వరకు ఉన్న వార్షిక ఆదాయాన్ని పన్నుల నుండి మినహాయించడం లేదా రూ.15 లక్షల నుండి రూ. 20లక్షల పరిధిలో ఉన్న వార్షిక ఆదాయానికి సవరించిన 25 శాతం పన్ను శ్లాబును వర్తింపజేయడంలో ఏదో ఒక నిర్ణయం మాత్రమే తీసుకునే అవకాశం ఉన్నట్లు మరో సమాచారం. ప్రస్తుత పన్ను విధానం ప్రకారం రూ.15 లక్షల కంటే ఎక్కువ ఉన్న వార్షిక ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తున్నారు. సంవత్సరానికి రూ.7.75 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్తో ఎలాంటి పన్ను చెల్లించడం లేదు.












Click it and Unblock the Notifications