Union Budget 2025: బడ్జెట్ పై ఎవరు ఏమన్నారంటే?
Union Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్ లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇది ఆమె వరుసగా ప్రవేశపెట్టిన 8వ బడ్జెట్. ఈ బడ్జెట్ ఆర్థిక సర్వేకు అనుగుణంగా ఉంది. మధ్య తరగతికి ఉపశమనం కల్పించడంతో పాటు కొత్త పన్ను విధానంలో వేతన జీవులకు ఆర్దికమంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటివరకూ 7 లక్షల వరకూ వార్షిక ఆదాయం కలిగిన వారికి ఎలాంటి పన్ను మినహాయింపు ఉండగా.. దాన్ని ఇప్పుడు ఏకంగా 12 లక్షలకు పెంచేశారు. దీంతో పాటు టీడీఎస్, టీసీఎస్ లోనూ పలు మార్పులు చేశారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు భారీ ఊరటనిచ్చారు. వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లు తీసుకొస్తామని ఆర్దికమంత్రి ప్రకటించారు. దీని వల్ల కోట్లాది మంది శ్రామిక వర్గ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది.
రైలు కాస్త పట్టాలు తప్పింది: కాంగ్రెస్
మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి పూర్తి బడ్జెట్ పై వివిధ నాయకుల నుంచి స్పందనలు వస్తున్నాయి. బీజేపీతో పాటు దాని మిత్రపక్షాల నాయకులు బడ్జెట్ ను ప్రశంసిస్తూ ప్రజా సంక్షేమం అని పిలుస్తుండగా.. ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ బడ్జెట్ ను విమర్శిస్తూ.. కేవలం నాలుగు కీలక రంగాలను అభివృద్ధికి శక్తి ఇంజిన్లుగా పేర్కొన్నారని అన్నారు. ఇంకా బడ్జెట్ రైలుకు అనేక ఇంజిన్లు ఉన్నాయని.. దీంతో ఆ బడ్జెట్ రైలు కాస్త పట్టాలు తప్పిందని విమర్శించారు. త్వరలో బీహార్ లో ఎన్నికలు జరగనున్నాయని.. తమ ప్రయోజనాల కోసమే కేంద్రం ఆ రాష్ట్రంలో బొనాంజా ప్రకటించిందని జైరాం రమేష్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. గత బడ్జెట్ లో ఇచ్చిన హామీలు నెరవేరాయో లేదో మనం చూడాలని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం విమర్శంచారు. బీహార్ కు సంబంధించి చేసిన ప్రకటనలు సహజమైనవేనని.. ఇది రాజకీయమన్నారు.

ఇది రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన బడ్జెట్: బీఎస్పీ
దేశంలో ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం వంటి తీవ్రమైన సమస్యలు ఉండడంతో పాటు రోడ్లు, నీరు వంటి ప్రాథమిక సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. అధిక జనాభా కలిగిన భారత్ లో ప్రజల జీవితం చాలా ఇబ్బందుల్లో ఉందని.. దీనిని కేంద్ర బడ్జెట్ ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ బడ్జెట్ కాంగ్రెస్ మాదిరిగానే రాజకీయ ప్రయోజనాలపై ఎక్కువగా దృష్టి సారించిందని విమర్శించారు. ప్రజలు, జాతీయ ప్రయోజనాలపై తక్కువగా దృష్టి సారించినట్లు ఆరోపించారు. ఇది కాకపోతే ఈ ప్రభుత్వ హయాంలో ప్రజల జీవితాలు ఎందుకు దుర్భరంగా ఉన్నాయని ప్రశ్నించారు. అభివృద్ధి చెందిన భారతదేశం కల బహుజనుల ప్రయోజనాలకు కూడా అనుకూలంగా ఉండాలన్నారు.
మహా కుంభమేళాలో మరణాల గణాంకాలు ముఖ్యమైనవి, బడ్జెట్ కాదు: ఎస్పీ
బడ్జెట్ కాదు.. మహాకుంభమేళాలో మరణించిన వ్యక్తుల గణాంకాలు చాలా ముఖ్యమైనవని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ప్రజలు చనిపోతే వారి గణాంకాలను కూడా అందించలేనప్పుడు మనం ఈ గణాంకాలను ఎందుకు నమ్మాలని ప్రశ్నించారు. ఇది భారత బడ్జెటో?.. బీహార్ బడ్జెటో?.. అని అర్థం కావడం లేదని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి మొత్తం బడ్జెట్ ప్రసంగంలో బీహార్ కాకుండా వేరే ఏదైనా రాష్ట్రం పేరు విన్నారా? అంటూ ప్రశ్నించారు.
బడ్జెట్ రైతు వ్యతిరేకం: శిరోమణి అకాలీదళ్
బడ్జెట్ లో ఎన్నికలు జరగనున్న బీహార్ పేరు మాత్రమే వినిపించిందని.. పంజాబ్ గురించి ప్రస్తావించలేదని శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్ సిమ్రత్ కౌర్ బాదల్ పేర్కొన్నారు. కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు గత 4 సంవత్సరాలుగా నిరసనలు చేస్తున్నారన్నారు. రైతుల కోసం వారు ఏమి ప్రకటించారని ప్రశ్నిస్తూ.. ఇది రైతు వ్యతిరేక బడ్జెట్ అంటూ విమర్శించారు. హక్కుల కోసం పోరాడుతున్న రైతుల గోడు వినబడకపోవడం విచారకరమన్నారు.
ఇది పేద వ్యతిరేక బడ్జెట్: ఆర్జేడీ
ఈ బడ్జెట్ గత బడ్జెట్ కాపీ అని ఆర్జేడీ నేత, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ అన్నారు. ఇది గ్రామీణ, పేద వ్యతిరేక బడ్జెట్ అంటూ విమర్శించారు. బీహార్ కు ఏమీ లభించలేదని, కేంద్ర మోడీ ప్రభుత్వం కూడా బీహార్ కు ఏమీ ఇవ్వాలని కోరుకోవడం లేదన్నారు. బడ్జెట్ సాకుతో, తేజస్వి మరోసారి ప్రత్యేక ప్యాకేజీ అంశాన్ని లేవనెత్తారు. బీహార్ ప్రత్యేక ప్యాకేజీకి డబ్బు ఎక్కడికి పోయిందని ఆయన అడిగారు.చంద్రబాబు నాయుడు రూ. 2 లక్షల కోట్ల ప్యాకేజీతో వెళ్లిపోయారని.. నితీష్ కుమార్ బీహార్కు ఏమీ తీసుకురాలేకపోయారని..నితీష్ అపస్మారక స్థితిలో ఉన్నారని తీవ్రంగా విమర్శించారు.
బడ్జెట్ పై కేజ్రీవాల్ ఏమన్నారంటే..
దేశ ఖజానాలో ఎక్కువ భాగం కొంత మంది ధనవంతులైన బిలియనీర్ల రుణాలను మాఫీ చేయడానికి ఖర్చు చేస్తున్నారని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఇక నుంచి ఏ బిలియనీర్ రుణాలనూ మాఫీ చేయబోమని బడ్జెట్ లో ప్రకటించాలని తాను డిమాండ్ చేశానన్నారు. దీని నుంచి ఆదా అయ్యే డబ్బును మధ్యతరగతి గృహ రుణాలు, వాహన రుణాల నుంచి ఉపశమనం కలిగించడానికి ఉపయోగించాలన్నారు. రైతుల రుణాలు మాఫీ చేయాలన్నారు. ఆదాయపు పన్ను, జీఎస్టీ రేట్లను సగానికి తగ్గించాలన్నారు. ఇది జరగనందుకు బాధగా ఉందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
భారతదేశ నిర్మాణానికి ఈ బడ్జెట్ ఒక బ్లూప్రింట్: అమిత్ షా
బడ్జెట్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. ప్రతి రంగంలోనూ అభివృద్ధి చెందిన, ఉత్తమ భారతదేశాన్ని నిర్మించాలనే మోడీ ప్రభుత్వ దార్శనికతకు ఈ బడ్జెట్ బ్లూ ప్రింట్ అని ఆయన అన్నారు. రైతులు, పేదలు, మధ్యతరగతి, మహిళలు, పిల్లల విద్య, పోషకాహారం, ఆరోగ్యంలో స్టార్టప్ లు, ఆవిష్కరణలు, పెట్టుబడుల వరకు ప్రతి రంగాన్ని ఈ బడ్జెట్ కవర్ చేస్తుందన్నారు. ఈ సమగ్రమైన, దార్శనిక బడ్డెట్ గురించి ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లను అభినందిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications