నీలగిరి కొండల్లో కూలిన హెలికాఫ్టర్ -రెండు మృతదేహాల వెలికితీత-కేంద్ర కేబినెట్ భేటీ
తమిళనాడులోని కూనూర్ లో ఆర్మీ హెలికాఫ్టర్ కుప్పకూలిన ఘటన దేశాన్ని షాక్ కు గురిచేసేలా ఉంది. ఈ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య, సహాయకులు కూడా ప్రయాణించారు. తమిళనాడులో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఈ ఛాపర్ ప్రమాదానికి గురికావడంపై కేంద్రం వెంటనే స్పందించింది. ప్రస్తుతం దీనిపై చర్చించేందుకు కేంద్ర కేబినెట్ భేటీ అయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
నీలగిరి కొండల్లో కూలిన హెలికాఫ్టర్
తమిళనాడులోని కూనూర్ లోని నీలగిరి కొండల్లో ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాఫ్టర్ ఎంఐ 17 వీ5 ఇవాళ కుప్పుకూలింది. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ప్రమాద సమయంలో హెలికాఫ్టర్ లో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా మొత్తం 9 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో చాలా మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. మరికొందరు మరణించారు. అయితే వీరి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు.
కాలేజీలో ప్రసంగానికి వెళ్తుండగా
తమిళనాడులో ఓ కాలేజీలో ప్రసంగం చేసేందుకు త్రివిధ దళాధిపతిగా ఉన్న బిపిన్ రావత్ ఈ హెలికాఫ్టర్ లో వెళ్తున్నట్లు తెలిసింది. మధ్యాహ్నం రెండు గంటల 45 నిమిషాలకు ఆయన ఈ ప్రసంగం చేయాల్సి ఉంది. ఆ లోపే ఈ ప్రమాదం జరిగిపోయింది. ఇందులో జనరల్ రావత్ బతికున్నారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే కేంద్రం మాత్రం దీనిపై పార్లమెంట్ లో అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
రెండు మృతదేహాల గుర్తింపు
ఆర్మీ హెలికాఫ్టర్ లో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్యతో పాటు మొత్తం 9 మంది ప్రయాణించినట్లు ఎయిర్ ఫోర్స్ నిర్దారించింది.య అయితే ఇందులో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బతికున్నారనేది ఇంకా పూర్తిగా స్పష్టం కాలేదు. అయితే ప్రమాద స్ధలంలో రెండు మృతదేహాల్ని అధికారులు గుర్తించారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన మరికొందరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్ధలంలో సహాయక చర్యల్లో మరో ముగ్గురిని కాపాడినట్లు తెలుస్తోంది.
కేంద్ర కేబినెట్ భేటీ
తమిళనాడులో చోటు చేసుకున్న ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాద ఘటనపై ఇప్పటికే రక్షణమంత్రి రాజ్ నాధ్ సింగ్ ప్రధాని మోడీకి సమాచారం అందించారు. దీంతో ఆయన వెంటనే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. అసలు హెలికాఫ్టర్ ప్రమాదానికి దారి తీసిన పరిస్దితులపై కేంద్ర కేబినెట్ మంత్రులు చర్చిస్తున్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఘటనా స్ధలికి బయలుదేరి వెళ్లనున్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది.
రష్యా నుంచి కొన్న హెలికాఫ్టర్
ఇవాళ ప్రమాదానికి గురైన ఈ ఎంఐ 17 వీ5 హెలికాఫ్టర్ ను ఆర్మీ 2012లో రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఆర్మీ అవసరాల కోసమే దీన్ని వాడుతున్నారు. త్రివిధ దళాధిపతి హోదాలో జనరల్ బిపిన్ రావత్ ఈ హెలికాఫ్టర్ లో ఆయన భార్యతో కలిసి ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు ఎప్పుడూ తోడుండే సహాయక అధికారులు కూడా ఈ ప్రమాదం బారిన పడ్డారు. అయితే వీరిలో ఎంతమంది బతికున్నారనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. దీనిపై త్వరలో ఎయిర్ ఫోర్స్ ఓ ప్రకటన చేసే అవకాశముంది.