యూకేలో కరోనా ఉత్పరివర్తన కలకలం: 21న కేంద్ర ఆరోగ్యశాఖ అత్యవసర భేటీ
న్యూఢిల్లీ: బ్రిటన్ దేశంలో కరోనావైరస్ ఉత్పరివర్తన చెంది కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అనేక మంది కరోనా బారినపడుతుండటమే గాక, అధిక సంఖ్యలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ దేశానికి పలు దేశాలు విమానాలను రద్దు చేశాయి. అంతేగాక, బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి.
అయితే, భారత్ మాత్రం ఈ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. యూకేలో కరోనా ఉత్పరివర్తనపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. సోమవారంనాడు వివిధ కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. భారత్లో అలాంటి పరిస్థితులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై చర్చ జరపనున్నారు.
ఇది ఇలావుండగా, కరోనా ఉత్పరివర్తన నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ప్లాన్స్ అన్నింటినీ మార్చుకోవాల్సిందిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రజలను రిక్వెస్ట్ చేశారు. యూకేలో కొత్తరకం కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో దాన్ని అరికట్టడానికి లండన్ సహా దక్షిణ ఇంగ్లాండ్లో కఠిన లాక్డౌన్ విధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఈ లాక్డౌన్ అమల్లోకి వస్తుందని ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.
ఈసారి క్రిస్మస్ను ప్రణాళిక ప్రకారం నిర్వహించుకునే అవకాశాలు లేకపోవం చాలా బాధగా ఉందని ప్రధాని అన్నారు. కొత్తరకం కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తోందని, ఈ వైరస్ 70 శాతం ఎక్కువ వేగంగా ఇది వ్యాప్తి చెందుతోందని యూకే ప్రధాన వైద్యాధికారి తెలిపారు. బుధవారం నుంచి నమోదైన కేసుల్లో 60 శాతం కంటే ఎక్కువే కొత్తరకం వైరస్ను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కొత్తరకం వైరస్ను వాక్సిన్ నిరోధిస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవని ఆయన తెలిపారు.
కాగా, యూకేలో కరోనా టీకా పంపిణీ కొనసాగుతోంది. ఫైజర్ టీకాకు యూకే ఈ నెల 8న అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో 90 ఏళ్ల మార్గరెట్ కీనన్ ప్రపంచంలో తొలి కరోనా టీకా వేయించుకున్నారు. యూకేలో మొదటి వారంలో సుమారు 1.37 లక్షల మందికి టీకా మొదటి డోసు అందింది. అయినాసరే ముందు జాగ్రత్త చర్యలు, వైరస్ వ్యాప్తి భయాల నేపథ్యంలో తాజా లాక్ డౌన్ విధించారు.