మీ నిర్లక్ష్యం వల్లే రైల్వే ప్రాజెక్టులు పెండింగ్, మోడీ వచ్చాకే 9 రెట్లు అధిక నిధులు: కేసీఆర్కు కిషన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.
తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పెండింగ్ అంశంతోపాటు పలు విషయాలపై ఆ లేఖలో పేర్కొన్నారు. రైల్వే ప్రాజెక్టుల నిధుల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు పదేపదే ఆరోపిస్తున్నారని, అందుకే తాను ఈ లేఖ రాయాల్సి వస్తోందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

కేంద్రం వివక్ష కాదు.. కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యం: కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన కొన్ని రైల్వే ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగానే ఆలస్యం అవుతున్నాయని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణకు కేటాయించిన ప్రాజెక్టుకు రాష్ట్ర సర్కారు భరించాల్సిన వ్యయాన్ని, కావాల్సిన భూకేటాయింపులను త్వరగా పూర్తిచేయాలని కోరారు. రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం వివక్ష చూపుతుందని టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో అంచనా వ్యయం భారీగా పెరిగిందని లేఖలో వివరించారు. 13 ప్రాజెక్టులకు కేంద్రం కేటాయించిన నిధుల వివరాలను లేఖలో ప్రస్తావించారు.

మోడీ ప్రధాని అయ్యాకే తెలంగాణకు 9 రెట్లు నిధులు పెరిగాయి
నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాతే తెలంగాణకు నిధుల కేటాయింపు 9 రెట్లు పెరిగిందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 2014-15 బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు రూ.250 కోట్లు కాగా, 2021-22 నాటికి కేటాయింపులు రూ.2,420 కోట్లకు పెరిగాయని వివరించారు. తెలంగాణలో రైల్వే నెట్వర్క్ 194 రూట్ కిలోమీటర్లు పెరిగినట్టు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ క్రమంలో ఏయే ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయో అన్నింటిని ఆయన తన లేఖలో వివరంగా పేర్కొన్నారు. . ఏయే ప్రాజెక్టు ఎలా వుందో కిషన్ రెడ్డి వివరించారు.

రాజన్న ఆలయం అభివృద్ధి ఎక్కడ కేసీఆర్: బండి సంజయ్
ఇది ఇలావుండగా, కేసీఆర్ సర్కారుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ నాస్తికుల రాజ్యాంగా మారిపోయిందన్నారు. ఆయన సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్.. భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం 400 కోట్లు కేటాయిస్తామన్నాడని.. ఊహ చిత్రాలు మాత్రమే చూపించాడని ఎద్దేవా చేశారు బండి సంజయ్. మేడారం జాతర కంటే ముందుగా రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ కానీ భక్తుల సౌకర్యాల పై ప్రభుత్వం సమీక్ష చేయక పోవడం బాధాకరమని బండి సంజయ్ అన్నారు.

సీఎం కేసీఆర్కు కౌంట్ డౌన్ స్టార్ట్: సంజయ్ ఫైర్
సీఎం కేసీఆర్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నారు. సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్నకు ఇచ్చిన హామీలు ఎందుకు నేరవేర్చలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. క్యూలైన్లో పసి పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆలయంలో శానిటేషన్ విఫలమైందని పరిశుభ్రత లేదన్నారు. తెలంగాణ వచ్చాక ఇంచార్జ్ ఈఓలే ఉన్నారని, ప్లాన్ ప్రకారం ఇంచార్జ్ ఈఓలను మారుస్తున్నారని మండిపడ్డారు. రాజన్న ఆలయంపై, పేద భక్తులపై ప్రభుత్వానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఎందుకని నిలదీశారు. ఆనాడు సమైక్యాంధ్ర కాబట్టి వివక్ష అయిందన్నాడు.. మరి తెలంగాణ రాష్ట్రమే కదా సీఎంగా ఉన్నది నువ్వే కదా? ఎందుకు అభివృద్ధి చేయడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతి పాదనలు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం తరుపున రాజన్న ఆలయాన్ని తాము అభివృద్ధి చేస్తామని బండి సంజయ్ కేసీఆర్కు సవాల్ విసిరారు. రాజన్న దేవుడికి శఠగోపం పెడుతావా కేసీఆర్?.. దేవుడికి ఇచ్చిన హామీలు నెరవేర్చక పోతే.. నీ సంగతి దేవుడే తెలుస్తాడన్నారు సంజయ్. దేవాలయ అభివృద్ధిపై రంగు రంగుల బ్రోచర్లు చూపిస్తూ ఇంకెంత కాలం భక్తులను మోసం చేస్తారని కేసీఆర్పై బండి సంజయ్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications