బడా నేతలకూ కరోనా కాటు: కేంద్ర మంత్రి పోఖ్రియాల్కు పాజిటివ్ -జైల్లో ఉన్న మాజీ ఎంపీ షాహాబుద్దీన్ కూడా
దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా సాగుతున్నది. రోజువారీ కొత్త కేసులు మూడు లక్షలకుపైగా, మరణాలు వేలల్లో నమోదవుతున్నాయి. ఢిల్లీనో పాలక, ప్రతిపక్ష పార్టీల్లో బడా నేతలు ఎందరో కరోనా కాటుకు గురవుతున్నారు. మహమ్మారి బారినపడుతున్న రాజకీయ ప్రముఖుల జాబితా అంతకంతకూ పెరుగుతున్నది. మాజీ ప్రధాని మన్మోహన్, కేంద్ర మంత్రి ప్రకాశ్ వదేకర్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలు ఇప్పటికే చికిత్స పొందుతుండగా, తాజాగా,
కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ కరోనా బారినపడ్డారు. ''ఈ రోజు చేయించుకున్న కరోనా నిర్ధారణ పరీక్షల్లో నాకు పాజిటివ్గా తేలింది. మా వైద్యులు సూచించినట్లుగా నేను చికిత్స తీసుకుంటూ, మెడిసిన్ వాడుతున్నాను. ఇటీవలి కాలంలో తనను కలిసిన అధికారులు, మిత్రులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా. అందరూ కరోనా పరీక్షలు చేయించుకోండి. కొద్ది రోజులపాటు హోమ్ క్వారెంటైన్లో ఉండండి'' అని పోఖ్రియాల్ బుధవారం ట్వీట్ చేశారు.

మరోవైపు, జంట హత్యల కేసులో ఢిల్లీలోని తిహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాహాబుద్దీన్ కూడా కరోనా బారిపడ్డారు. బుధవారం ఆయనకు వైద్యులు పరీక్ష నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో భారీ పోలీసుల బందోబస్తు నడుమ అతడిని చికిత్స నిమిత్తం స్థానిక డీడీయూ ఆసుపత్రికి తరలించారు.
ఢిల్లీలో కోవిడ్ ఉధృతి తీవ్రంగా ఉండటంతో ప్రఖ్యాత జైళ్లలో కేసులు పెరిగాయి. తిహార్లోని మూడు జైళ్లలో ఇప్పటికే చాలా మంది ఖైదీలు కరోనా బారినపడ్డారు. ఈ నెల 12 నాటికి 59 మంది ఖైదీలు ఏడుగురు జైలు సిబ్బందికి వైరస్ సోకింది. ఏప్రిల్ 17 నాటికి ఈ సంఖ్య రెట్టింపైంది. ఢిల్లీలోని తిహార్, రోహిని, మండోలి జైళ్లలో దాదాపు 18,900 మంది ఖైదీలను ఉంచారు. ఈ మూడు జైళ్ల పూర్తి సామర్థ్యం 10,026 మంది మాత్రమే.












Click it and Unblock the Notifications