విషాదం: ఆక్సిజన్ ప్లాంట్లో జంబో సిలిండర్లు పేలి ముగ్గురు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో విషాద ఘటన చోటు చేసుకుంది. చిన్హట్ పోలీస్టేషన్ పరిధిలోని దేవా రోడ్లో ఉన్న ఆక్సిజన్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో ఆక్సిజన్ సిలిండర్లు పేలిపోయి ముగ్గురు మృతి చెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
లక్నో పోలీస్ కమిషనర్ డీకే ఠాకూర్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఆక్సిజన్ సిలిండర్లు పేలి ముగ్గురు మృతి చెందారని తెలిపారు. ఓ రోగి బంధువు తీసుకొచ్చిన ఆక్సిజన్ జంబో సిలిండర్లు లోపభూయిష్టంగా ఉండటంతో ఆక్సిజన్ నింపే సమయంలో ఈ పేలుడు ఘటన చోటు చేసుకుందని చెప్పారు.
పేలుడు ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని చీఫ్ ఫైర్ ఆఫీసర్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఈ పేలుడు సంభవించిందని, దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయని చెప్పారు. సిలిండర్ల కోసం క్యూలో నిల్చున్నవారు తొక్కిసలాటకు గురయ్యారని తెలిపారు. దీంతో పలువురు గాయపడ్డారని చెప్పారు. పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.
పేలుడు కారణంగా చనిపోయినవారిని గుర్తించడం సాధ్యం కాలేదని పోలీసులు తెలిపారు. పేలుడు ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సహాయ కార్యక్రమాలను త్వరితగతిన చేపట్టాలని, గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం యోగి ఆదేశించారు.
Recommended Video