వారణాసి ‘కమల’ వశమేనా?
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రెండున్నరేళ్ల క్రితం లోక్ సభ ఎన్నికల్లో 80 స్థానాలకు 71 స్థానాల్లో విజయంతో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు తర్వాత.
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రెండున్నరేళ్ల క్రితం లోక్ సభ ఎన్నికల్లో 80 స్థానాలకు 71 స్థానాల్లో విజయంతో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఇటువైపు కన్నెత్తి చూడకున్నా.. అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా? అని రూపొందించిన వ్యూహంతో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సహా 20 మందికి పైగా కేంద్ర మంత్రులంతా వారణాసిలో వారం పాటు తిష్ఠ వేసి కేంద్రంగా బిజెపికి జవసత్వాలు కలిగించేందుకు పూనుకున్నారు.
గతంలో ఎన్నడూ ఏ ప్రధాని కూడా చేయని విధంగా ఏకంగా మూడు రోజుల పాటు వారణాసిలో తిష్ట వేసి రోడ్ షోలతో హోరెత్తించిన ప్రధాని మోదీ వ్యూహాత్మకంగానే ప్రచారం ముగించారు. చివరిదశలోని 40 అసెంబ్లీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. తద్వారా పశ్చిమ యూపీ బెల్ట్లో ముస్లింలు, జాట్ల వ్యతిరేకతతో కలిగిన లోటును పూర్వాంచల్ ప్రాంతంలో పూడ్చుకోవాలని కమలనాథులు సంకల్పించారు. అందుకనుగుణంగా రాజకీయ చాతుర్యం ప్రదర్శిస్తున్న బిజెపి.. ప్రత్యర్థుల పునాదులు కదిలించాలని చూస్తోంది. అధికార ఎస్పీ, ప్రతిపక్ష బీఎస్పీ అధినేత మాయావతి వ్యూహాత్మక పొరపాట్లను తనకు అనుకూలంగా మలచుకుంటున్నది.
ఎస్పీ పట్ల వ్యతిరేకతను అనువుగా మార్చుకునేందుకు బీజేపీ యత్నిస్తున్నది. ఎస్పీ నుంచి వచ్చిన నాయకులకు ప్రాధాన్యం ఇచ్చి టికెట్లు కేటాయించిన తమ నాయకురాలు మాయావతిపై బీఎస్పీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నాయి. వీటికి తోడు పూర్వాంచల్లోని మరికొన్ని స్థానిక పరిస్థితులూ కమలనాథులకు సానుకూలంగా మారాయి.
ఎస్పీ ముస్లింల అనుకూల పార్టీగా పేరు తెచ్చుకున్నా ఈ దఫా ఆ వర్గం ఓటర్లు బీఎస్పీకి దగ్గర కావడానికి ఆ పార్టీలో చేరిన ముక్తర్ అన్సారీ ప్రాబల్యమే కారణమని అంటున్నారు. గ్యాంగ్స్టర్ ముక్తర్ అన్సారీని ఎస్పీలో చేర్చుకునేందుకు అఖిలేశ్ తిరస్కరించటం వల్ల వారణాసి-మౌ ప్రాంతంలో ముస్లింలు ఎస్పీకి దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ముస్లింల ఓట్లతో బీఎస్పీ గెలుస్తుందన్న భయం స్థానికుల్లో ఉంది.
యాదవుల మనస్సు దోచేందుకు మోదీ ఇలా
అందులో భాగంగానే యాదవుల ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా భావించే గద్వా ఘాట్ను ప్రధాని మోదీ సోమవారం సందర్శించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆశ్రమానికి యాదవులే నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలతో సంబంధంలేకుండా తరచూ ఈ ఆశ్రమాన్ని సందర్శించే ములాయం సింగ్ యాదవ్, శివపాల్ యాదవ్ ప్రస్తుత ఎన్నికల సమయంలో ఒక్కసారి కూడా ఇక్కడకు రాలేదు. ఎస్పీలో నిర్ణయాత్మక హోదాల నుంచి వీరిద్దరినీ అఖిలేశ్ తొలగించటం దీనికి ఒక కారణం. ముఖ్యమంత్రి అఖిలేశ్ ఇంత వరకూ ఆశ్రమాన్ని మర్యాదపూర్వకంగానైనా సందర్శించక పోవటం పట్ల యాదవ వర్గీయులు ఒకింత ఆగ్రహంగానే ఉన్నారని భక్తులు తెలిపారు. అఖిలేశ్ తన తండ్రి ములాయం సింగ్ మాదిరిగా యాదవ ముద్రను కోరుకోవటంలేదని, యువకుల ప్రతినిధిగా పేరుతెచ్చుకోవాలన్నదే అతని ప్రయత్నమని సన్నిహితుల సమాచారం. ఇది కూడా స్థానికుల్లో అఖిలేశ్ పట్ల ప్రతికూల వాతావరణానికి దారి తీస్తున్నదని స్థానికులు అంటున్నారు.
శాస్త్రి పట్ల మోదీ ఇలా..
ఆ తర్వాత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి పూలమాల వేసి, ఆయన చిన్ననాటి నివాసమున్న భవనాన్ని సందర్శించారు. అక్కడ కొద్దిసేపు బస చేయడం ద్వారా ఎల్బీ శాస్త్రికి తామే సరైన వారసులమన్న సంకేతాన్ని పంపేందుకు పూనుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ - గాంధీ కుటుంబాలకు మాత్రమే ప్రాధాన్యం లభించింది. తొలి ఉప ప్రధాని సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, నెహ్రూ తర్వాత ప్రధానిగా పనిచేసిన ఎల్బీ శాస్త్రిని కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందనే విమర్శలు ఉన్నాయి. అదీ వాస్తవం కూడా.
ఎల్బీ శాస్త్రిపై మోదీ ఇలా
గతంలో పటేల్ వారసత్వం తమదేనని ప్రకటించుకున్న బిజెపి.. తాజాగా ఎల్బీ శాస్త్రికి తామే వారసులమన్న అభిప్రాయం కలిగించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించారు. తద్వారా 14 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న బిజెపిని యూపీ సీఎం పీఠంపై కూర్చుండబెట్టేందుకు సర్వ యత్నాలు పూర్తిచేశారు. ఇక్కడ మరొక సమస్య కూడా ఇమిడి ఉన్నదని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రపంచ దేశాల్లో భారత ప్రధానిగా మోదీ బలమైన నాయకుడన్న ముద్ర పొందారు. దేశ రాజకీయాలనే మార్చివేసే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ప్రతికూల ఫలితాలు వస్తే అంతర్జాతీయంగానూ, జాతీయంగానూ సమస్యలు తలెత్తుతాయన్న ఆందోళన కూడా అంతర్లీనంగా ఇమిడి ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ప్రధాని మోదీపై యూపీ సీఎం అఖిలేశ్ ఇలా
ఐదో దశ పోలింగ్ ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ ఒక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఇప్పటికే బీజేపీ విజయం సాధించిందని, ఇక చివరి రెండు దశల్లో లభించే సీట్లు తమకు బోనస్ అని ప్రకటించారు. దీన్నే ఎస్పీ అధ్యక్షుడు - యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ లేవనెత్తారు. చివరి రెండు దశల పోలింగ్ జరిగే ప్రాంతాల్లో వచ్చే సీట్లు బోనస్ అయితే మూడు రోజులు ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలోనే ఎందుకు తిష్ట వేశారని వరుసగా రోడ్ షోలు ఎందుకు నిర్వహిస్తున్నారని నిలదీశారు.
రాజ్ నాథ్, యోగి ఇలా..
బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి వ్యవహార శైలి వల్ల ఆ పార్టీకి ఠాకూర్లు, యాదవులు బద్ధశత్రువులుగా మారారు. బీఎస్పీని ఓడించే విషయంలో స్థానికంగా ఎస్పీ అభ్యర్థులు బలహీనంగా ఉన్నారనే అభిప్రాయం కలిగినప్పుడు ప్రత్యామ్నాయాలను వారు అన్వేషిస్తున్నారు. బుధవారం ఎన్నికలు జరిగే ఏడు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, గోరఖ్పూర్ ఎంపి యోగీ ఆదిత్యనాథ్ ఠాకూర్ల పాబల్య ప్రాంతాల్లో పలు సభలు నిర్వహించారు. వారికి తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నించారు.
బయటివారికి టిక్కెట్లపై బీఎస్పీలో ఇలా
సమాజ్వాదీ నుంచి వచ్చిన నాయకులకే ప్రాధాన్యమిస్తూ, పార్టీ మద్దతుదారులను మాయావతి విస్మరించటం పట్ల బీఎస్పీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మూడు దశాబ్దాలకు పైగా ములాయం సింగ్ ప్రధాన అనుచరులుగా ఉంటూ ఎస్పీ టికెట్ లభించకపోవటంతో బీఎస్పీ చెంతకు చేరిన అంబికా చౌదురి, నారద్ రాయ్లకు ఫెప్నా, బలియా టికెట్లను మాయావతి కేటాయించారు. వీరిద్దరిపై దళిత వ్యతిరేకులనే ముద్ర ఉంది. ఈ పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయటానికి మనసు ఒప్పుకోవటంలేదని బీఎస్పీ కార్యకర్తలు అంటున్నారు. ప్రధాన ప్రత్యర్థి పార్టీలు ఈ విధమైన అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే బిజెపి..స్థానికంగా బలమైన సామాజిక వర్గాలు కుర్మి, రాజ్బర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అప్నాదళ్, సుహల్దేవ్ సమాజ్ పార్టీలతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. ప్రత్యర్థి పార్టీల్లో ఓట్లు చీలిపోవటం, మిత్రపక్షాల ఓట్లను కూడగట్టడం వంటి సానుకూలతల వల్ల ఏడో దశ పోలింగ్లో బిజెపి లబ్ధిపొందనున్నది.
వారణాసిలో తెరపిలేని రాజకీయ కార్యకలాపాలు
నేపాల్ సరిహద్దుల్లో ఉండే పూర్వాంచల్ ప్రాంతంలోని వారణాసి గత వారం రోజులుగా రాజకీయ కార్యకలాపాలకు ప్రత్యేకించి బిజెపికి కేంద్రంగా మారింది. అక్కడే తిష్ఠ వేసిన బిజెపి అధ్యక్షుడు అమిత్ షా.. తనతోపాటు 24 మంది కేంద్రమంత్రులను వారణాసికి రప్పించారు. వారణాసితోపాటు మీర్జాపూర్ జిల్లాలోనూ పార్టీ విజయావకాశాల ప్రాముఖ్యాన్ని వారికి విశదపరిచారు. యూపీ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావించిన అమిత్ షా ప్రచారానికి సవివరమైన వ్యూహ రచన చేశారు. దీనికి తోడు సమన్వయానికి ఆరెస్సెస్ ఆశీస్సులు ఉన్నాయనుకోండి. అది వేరే విషయం. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, స్ముతి ఇరానీ, రవి శంకర్ ప్రసాద్ తదితర వివిధ శాఖలకు చెందిన కేంద్ర మంత్రులు వారణాసిలోనే బస చేశారు. ఆయా సామాజిక వర్గాల వారీగా ప్రజలతో కాలనీలు, బస్తీల్లో 20, 30 మందితో ఇష్టాగోష్టి సమావేశాలు జరుపుతున్నారు. బీజేపీని గెలిపించాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
వ్యాపారులతో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ఇలా..
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వారణాసిలోని వివిధ రంగాల వ్యాపారులతో వరుసగా భేటీ అవుతూ వారి సందేహాలను పరిష్కరిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల భవిష్యత్ లో పలు దీర్ఘ కాలిక ప్రయోజనాలు ఉన్నాయని నచ్చజెప్పారు. ఒకేసారి పెద్ద నోట్లు రద్దుచేయడంతో 86 శాతం నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. ఫలితంగా సగటు పౌరుడు మొదలు బడా వ్యాపార వేత్త వరకూ ప్రతి ఒక్కరూ నగదు కొరతతో తల్లడిల్లిపోయారు. ప్రత్యేకించి చిన్న వ్యాపారుల లావాదేవీలపై తీవ్రస్థాయిలో ప్రతికూల ప్రభావం చూపింది. ఇక వస్తు సేవల పన్ను (జీఎస్టీ)తో పుష్కలమైన ప్రయోజనాలు ఉన్నాయని వ్యాపారులకు మంత్రి అరుణ్ జైట్లీ వివరించారు. అయితే ఈ నెల 11వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వారణాసికి ఎంత మంది కేంద్రమంత్రులు వస్తారో వేచి చూడాల్సిందేనని పలువురు పట్టణ ప్రముఖులు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.