ఢిల్లీలో మరో రైతు ఆత్మహత్య.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బలిదానం.. సూసైడ్ నోట్లో ఏం చెప్పాడంటే...
మరో రైతు గుండె ఆగిపోయింది... కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 75 ఏళ్ల ఓ వృద్ద రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని ఘాజీపూర్ వద్ద రైతులు నిరసన తెలియజేస్తున్న ప్రదేశంలోనే ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో నిరసన ప్రదేశంలో ఇప్పటివరకూ ఆత్మహత్యలకు పాల్పడినవారి సంఖ్య మూడుకి చేరింది. రైతు ఉద్యమానికి తన ప్రాణాన్ని బలి ఇస్తున్నానని... కేంద్రం తీసుకొచ్చిన చట్టాలతో రైతులకు మేలు జరగదని సూసైడ్ నోట్లో ఆ రైతు పేర్కొనడం గమనార్హం.

ఎవరా రైతు...
ఘజియాబాద్ పోలీసులు ఈ ఘటనపై మాట్లాడుతూ... శనివారం(జనవరి 2) ఉదయం ఘజియాబాద్లో రైతులు నిరసన తెలియజేస్తున్న ప్రదేశంలో... సమీపంలోని టాయిలెట్లో కాశ్మీర్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తమకు సమాచారం అందిందన్నారు. వెంటనే అక్కడికి చేరుకుని అతన్ని ఆస్పత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారన్నారు. మృతి చెందిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లాకు చెందిన కాశ్మీర్ సింగ్గా గుర్తించామన్నారు. ఆత్మహత్య చేసుకున్న చోట సూసైడ్ నోట్ లభించిందన్నారు.

సూసైడ్ నోట్లో ఏముంది...
'కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల పట్ల నిరసన తెలియజేసేందుకే నేను ఢిల్లీ సరిహద్దుకు వచ్చాను... ఆ చట్టాలు రైతులకు ఏమాత్రం అనుకూలంగా లేవు. వాటివల్ల రైతులకు ఏమీ ఒరగదు. కాబట్టి వాటిని రద్దు చేయాలన్నదే రైతులుగా మా డిమాండ్. కానీ ప్రభుత్వం వాటిని ఉపసంహరించుకోవట్లేదు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్,హర్యానా రాష్ట్రాల్లో ఇప్పటివరకూ 50 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కానీ ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్లో మాత్రం ఇంతవరకూ ఎవరూ ప్రాణ త్యాగం చేయలేదు. అందుకే ఈ చట్టాలను వ్యతిరేకించేందుకు నేను నా ప్రాణాన్ని త్యాగం చేస్తున్నాను..' అని కాశ్మీర్ సింగ్(75) అనే ఆ రైతు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.

ఎప్పుడు ఏ అవసరమొచ్చినా...
అదే లేఖలో కాశ్మీర్ సింగ్ తన కుటుంబ సమస్యల గురించి కూడా ప్రస్తావించడం గమనార్హం. తన ఇద్దరు మనవరాళ్ల పెళ్లి బాధ్యతను సిక్కు కమ్యూనిటీ తీసుకోవాలని కోరాడు. కాశ్మీర్ సింగ్ ఆత్మహత్య ఘాజిపూర్లో ఆందోళన చేస్తున్న రైతులను తీవ్రంగా కలచివేసింది. పాలు,పంచదార,గోధుమ పిండి... ఇలా ఎప్పుడు ఏది అవసరమొచ్చినా కాశ్మీర్ సింగ్ వెంటనే వాటిని తెప్పించేవాడని అక్కడి రైతులు గుర్తుచేసుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యలు కలచివేస్తున్నాయని వాపోతున్నారు.

స్వగ్రామంలో అంత్యక్రియలు
కాశ్మీర్ సింగ్ కుమారుడు లఖ్వీర్ సింగ్ మాట్లాడుతూ... తన తండ్రి అంత్యక్రియలను తమ స్వగ్రామంలో నిర్వహిస్తామని చెప్పారు. గత 20-25 రోజులుగా తన తండ్రి రైతుల ఆందోళనల్లో పాల్గొంటున్నాడని చెప్పారు. కానీ ఆయన ఇలా చేస్తారని ఎవరూ ఊహించలేదన్నారు. తమతోనూ ఏ విషయం చెప్పలేదన్నారు. కొంతమంది రైతు సోదరులు తమకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాకే తండ్రి ఆత్మహత్య విషయం తమకు తెలిసిందన్నారు.

మూడుకి చేరిన సంఖ్య...
కాశ్మీర్ సింగ్ మరణంతో ఢిల్లీ సరిహద్దులో ఇప్పటివరకూ ఆత్మహత్యకు పాల్పడిన రైతుల సంఖ్య 3కి చేరింది. అంతకుముందు హర్యానాకు చెందిన 65 ఏళ్ల సంత్ బాబా రామ్ సింగ్,పంజాబ్కి చెందిన 63 ఏళ్ల అమర్జిత్ సింగ్ అనే న్యాయవాది ఆత్మహత్యలకు పాల్పడ్డారు.పంజాబ్కే చెందిన 70 ఏళ్ల నిరంజన్ సింగ్ మరో రైతు కూడా ఆత్మహత్యకు యత్నించినప్పటికీ.. అతను ప్రాణాలతో బయటపడ్డాడు.
రైతులతో కేంద్రం చర్చలు ఇప్పటికే పలుమార్లు విఫలమవగా జనవరి 4న మరోసారి వారితో సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 40 రోజులుగా రైతులు ఢిల్లీ సరిహద్దులో ఉద్యమిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశంలోనైనా చర్చలు కొలిక్కి వస్తాయా అన్న చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications