ఎమ్మెల్సీ భార్య భాగోతం: కొడుకును చంపి కట్టుకథ చెప్పింది..కటకటాల పాలైంది
సొంత కొడుకునే చంపేసిన ఘటనలో ఉత్తర్ ప్రదేశ్ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ భార్య మీరా యాదవ్ను పోలీసులు అరెస్టు చేశారు. తన 23 ఏళ్ల కొడుకు అభిజిత్ యాదవ్ను తనే చంపినట్లు మీరా యాదవ్ ఒప్పుకుందని పోలీసులు వెల్లడించారు. అభిజిత్ యాదవ్ దారుల్షఫాలోని క్వార్టర్స్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం అభిజిత్ గుండెపోటు రావడంతో మృతిచెంది ఉంటాడని అంతా భావించారు. శనివారం అర్థరాత్రి అభిజిత్ ఫూటుగా తాగి ఇంటికొచ్చాడని మీరాయాదవ్ చెప్పింది. రాత్రంతా ఏదో ఆరోగ్యసమస్యతో ఉన్నట్లు కనిపించాడని ఆమె చెప్పింది. ఎడమ చేతి వైపు నొప్పి ఉందని చెప్పడంతో అభిజిత్ గుండెలపై ఆయింట్మెంట్ రాసినట్లు మీరా యాదవ్ తెలిపింది. నిద్రలోకి జారుకున్న అభిజిత్ ఇక శాస్వతంగా నిద్రపోయాడని చెప్పింది మీరాయాదవ్.
ఇక మీరా యాదవ్ చెప్పిన కథనం ప్రకారం అభిజిత్ది సహజమరణమే అనుకున్నారు. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు తరలిస్తున్న సమయంలో కొందరు బంధువుల అనుమానం వ్యక్తం చేశారు. లక్నో సీనియర్ ఎస్పీ కళానిధి నైతానీ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించాలని ఆదేశించారు. రిపోర్టులో షాకింగ్ అంశం బయటపడింది. అభిజిత్ది సహజ మరణం కాదని ఎవరో గొంతునులిమి చంపేశారని వైద్యులు నివేదికలో తెలిపారు. ఇక విచారణ సందర్భంగా మీరా యాదవ్ పొంతన లేని సమాధానాలు ఇస్తుండటంతో పోలీసులకు మరింత అనుమానం వచ్చింది.
అభిజిత్ శనివారం సాయంత్రం మద్యం సేవించి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తనను నియంత్రించేందుకు చాలా శ్రమించినట్లు మీరా యాదవ్ పోలీసుల విచారణలో వెల్లడించింది. అయితే ఎంతకీ మాటవినకపోవడంతో గొంతు నులిమి చంపేసినట్లు మీరా యాదవ్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. రాష్ట్ర పర్యాటక శాఖలో మీరా యాదవ్ ఉద్యోగినిగా పనిచేస్తూ ఈ మధ్యనే ఆమె ఉద్యోగం మానేశారు. దారుల్షఫా ఫ్లాట్స్లో ఆమె ఇద్దరి కొడుకులు అభిషేక్, అభిజిత్లతో కలిసి ఉంటోంది. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కు మీరా యాదవ్ రెండో భార్య.