లంచం ఇవ్వలేదని యువకుల్ని చంపిన పోలీసులు
మెయిన్ పూరి (ఉత్తర్ ప్రదేశ్): లంచం ఇవ్వలేదని కోపంతో ఇద్దరు యువకులను చితక్కొట్టిన పోలీసులు వారిని నదిలో పడేసి చంపేసిన సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. మెయిన్ పూరిలో ఈ దారుణం జరిగింది.
ఓ వర్గానికి చెందిన వారు ట్రాక్టర్ లో రాళ్లు వేసుకుని పట్టణానికి తీసుకు వెలుతున్నారు. ట్రాక్టర్ లో పంకజ్ యాదవ్ (24), దిలీప్ యాదవ్ (22)తో పాటు నలుగురు ఉన్నారు. చెక్ పోస్టు దగ్గర పోలీసులు ట్రాక్టర్ ను నిలిపారు.
రాళ్లు తీసుకు వెళ్లాలంటే రూ. 1,200 లంచం ఇవ్వాలని పోలీసులు డిమాండ్ చేశారు. మేము ఎందుకు లంచం ఇవ్వాలని వారు పోలీసులను ప్రశ్నించారు. మాటామాట పెరగడంతో రెచ్చిపోయిన పోలీసులు లాఠీలు తీసుకుని నలుగురిని ఇష్టం వచ్చినట్లు చితకబాదేశారు.
ఇద్దరు తప్పించుకుని గ్రామం వైపు పరుగు తీశారు. పంకజ్ యాదవ్, దిలీప్ యాదవ్ లు పోలీసులకు చిక్కిపోయారు. వారిద్దరిని ఇష్టం వచ్చినట్లు కొట్టిన పోలీసులు తరువాత సమీపంలోని నదిలో పడేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
గ్రామానికి చేరుకున్న ఇద్దరు జరిగిన విషయం గ్రామస్తులకు చెప్పారు. గ్రామస్తులు పలు వాహనాలలో చెక్ పోస్టు దగ్గరకు చేరుకున్నారు. లంచం డిమాండ్ చేసిన పోలీసులను పట్టుకుని చితకబాదేశారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతున్న పంకజ్ యాదవ్, దిలీప్ యాదవ్ నదిలో పడి మరణించారని పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రత్యక్ష సాక్షులు మాత్రం వారిద్దరిని పోలీసులు చంపేశారని అంటున్నారు.
లంచం డిమాండ్ చేసిన చెక్ పోస్టు ఇన్ చార్జ్, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోం గార్డులను సస్పెండ్ చేశామని, వారి మీద కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. ఉత్దర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మీద బీజేపీ మండిపడింది. రాష్ట్రంలో దలితులకు భద్రత కరువైయ్యిందని బీజేపీ నాయకులు ఆరోపించారు.