Parliament : మణిపూర్ పై అట్టుడికిన పార్లమెంట్.. ! అమిత్ షా కీలక ప్రకటన..
మణిపూర్ ఘటనలపై ఇవాళ పార్లమెంట్ ఉభయసభలు అట్టుడికాయి. ఉదయం సమావేశమైనప్పటి నుంచి ఉభయసభల్లోనూ విపక్షాలు మణిపూర్ ఘటనలపై ప్రధాని మోడీ స్పందన కోరుతూ కార్యకలాపాల్ని అడ్డుకున్నాయి. కేంద్రం తరఫున మంత్రులు పదే పదే విజ్ఞప్తి చేసినా, స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా విపక్షాలు శాంతించలేదు. అసలే ఇండియా పేరుతో కొత్త కూటమి ఏర్పాటు చేసుకుని ఏకమైన విపక్షాలు ఉమ్మడి నిరసనలు కొనసాగించాయి. దీంతో ఉభయసభలు పదే పదే వాయిదా పడ్డాయి.
విపక్షాల నిరసనలతో ఇవాళ లోక్సభ, రాజ్యసభ కార్యకలాపాలు రేపటికి వాయిదా పడ్డాయి. వర్షాకాల సమావేశాల మూడో రోజు పార్లమెంటు మణిపూర్ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై ప్రతిపక్ష సభ్యులు వరుస నిరసనలను కొనసాగించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ అంశంపై చర్చిస్తామని సభకు హామీ ఇచ్చినప్పటికీ విపక్షాలు శాంతించలేదు. ఈ నిరసనల మధ్యే రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సస్పెండ్ అయ్యారు. ఢిల్లీ ఆర్డినెన్స్ పై ఆయన కేంద్రమంత్రులతో వాగ్వాదానికి దిగారు. సభాపతి శాంతించాలని పదే పదే కోరినా నిరసన కొనసాగించారు. దీంతో సస్పెండ్ చేశారు.

మరోవైపు లోక్సభ మధ్యాహ్నం 2:30 గంటలకు తిరిగి సమావేశమైంది. అయితే అంతకుముందు వాయిదా తర్వాత ప్రతిపక్ష బెంచ్ల నుండి నినాదాలు కొనసాగాయి. స్పీకర్ ఓం బిర్లా వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నందున ప్రతిపక్షాలు ఎందుకు చర్చకు అనుమతించడం లేదో అర్థం కావడం లేదని అమిత్ షా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతకుముందు ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. మరో బిల్లును ఉపసంహరించుకుంది.
కేంద్రం ఇవాళ డీఎన్ఏ టెక్నాలజీ (యూజ్ అండ్ అప్లికేషన్) రెగ్యులేషన్ బిల్లు, 2019ని ఉపసంహరించుకోగా, నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు, 2023, నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కమిషన్ బిల్లు, 2023 మరియు రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాల) ఆర్డర్ (సవరణ) బిల్లు, 2023ని ప్రవేశపెట్టింది.అయితే విపక్షాల నిరసనలతో వీటిపై చర్చ ముందుకు సాగలేదు. చివరికి ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి.












Click it and Unblock the Notifications