UPSC: ఐదేళ్ల కష్టాన్ని తక్కెడపై తూచి! 464 రూపాయలకు కలను వదిలేసి. "దేవుడి కంటే నా మనసే పెద్దది"
దేశంలోనే అత్యున్నతమైన ఉద్యోగం సాధించి సమాజంలో ఉన్నతంగా నిలవాలనేది ఆ యువకుడి కల. అనుకున్నదే తడవుగా చేతిలో డిగ్రీ పట్టా పట్టుకుని యూపీఎస్సీ వైపు అడుగులు వేశాడు. మంచి ఆఫర్ ఇచ్చిన కార్పొరేట్ ఉద్యోగాన్ని కూడా పక్కనపెట్టి, పగలు రాత్రి తేడా లేకుండా పుస్తకాలతోనే లోకంగా గడిపాడు. ఒక్కసారి సివిల్స్ కొడితే జీవితం మారిపోతుందన్న ఆశతో వరుసగా 2023, 2024, 2025 లలో ఏకంగా మూడుసార్లు మెయిన్స్ పరీక్షల వరకు వెళ్లాడు. కానీ, అదృష్టం చివరి నిమిషంలో ముఖం చాటేసింది. ఈసారి ఏకంగా ప్రిలిమ్స్లోనే ఆగిపోవడంతో అతడి ఆశల సౌధం ఒక్కసారిగా కూలిపోయింది.
ఇక చాలు.. ఈ ప్రయాణానికి ఇక్కడితో స్వస్తి చెప్పాలనుకున్నాడు. ఐదేళ్లుగా ప్రాణంగా చూసుకున్న పుస్తకాలు, స్వయంగా రాసుకున్న నోట్స్, రాత్రింబవళ్లు శ్రమించి పూర్తి చేసిన మాక్ టెస్ట్ పేపర్లు.. అన్నింటినీ ఒకచోట చేర్చాడు. కబాడీవాలాను పిలిచి ఆ రద్దీ కాగితాల మొత్తాన్ని తూకం వేసి.. తక్కెడ ముల్లు కిందకు దిగుతుంటే, తన గుండెల్లో ఏదో గొంతును పిండేస్తున్నంత వేదన అనుభవించాడు. ఇతరులకు అవి కేవలం పాత కాగితాల పంటే కావచ్చు.. కానీ అతడికి అవి కేవలం పుస్తకాలు కావు. తెల్లవారుజామున 4 గంటలకు లేచి రాసిన నోట్స్, ఒక్క మార్కు ఎక్కువ సాధించడం కోసం వందల సార్లు దిద్దుకున్న జవాబులు, తన రక్తాన్ని ధారపోసి రాసిన భవిష్యత్తు సంతకాలు అవి.

వదులుకున్న జాబ్..
ఆ పుస్తకాల బరువు కిలోల్లో తూగవచ్చు కానీ, వాటి వెనుక అతడు చేసిన త్యాగాలు ఏ తక్కెడకూ అందవు. సివిల్స్ సాధిస్తానన్న నమ్మకంతో 2022లో వచ్చిన భారీ జీతం ఆఫర్ను వదులుకున్నాడు. ఆ నిర్ణయమే నేడు అతడిని నలుగురిలో నవ్వులపాలు చేసింది. జాలి చూపేలా చేసింది. ఈ కఠిన ప్రయాణంలో ఐదేళ్ల అనుబంధమున్న ప్రేమ కూడా దూరమైంది. స్నేహితులు, బంధువులు ముందుకు సాగిపోతుంటే.. తాను మాత్రం అదే పుస్తకాల మధ్య బందీగా మిగిలిపోయాడు. ప్రతీసారి తోసిపడేసినా 'ఇంకొక్కసారి ప్రయత్నించు' అని లోపలి గొంతు హెచ్చరించేది. కానీ, ఈసారి ఆ గొంతు శాశ్వతంగా మూగబోయింది.
లక్షల విలువైన కల.. అక్షరాలా రూ. 464!
పుస్తకాలన్నీ తూచాక ఆ రద్దీ వ్యాపారి అతడి చేతిలో రూ. 464 పెట్టాడు. పక్కనే ఉన్న వ్యక్తి "కొంచెం బేరం ఆడితే ఇంకో 150 రూపాయలు ఎక్కువే వచ్చేవిగా" అని ఉచిత సలహా ఇచ్చాడు. దానికి ఆ యువకుడు చెప్పిన సమాధానం వింటే ఎవరికైనా కళ్లు చెమరుస్తాయి. "ఈ పుస్తకాల నుంచి నేను అనుకున్నది ఏనాడూ పొందలేకపోయాను.. ఇక వాటికి మరో వంద లేదా రెండు వందలు ఎక్కువ వచ్చినా వచ్చే నష్టమేంటి? నా జీవితంలో పోయిన ఐదేళ్లతో పోలిస్తే ఈ రూ. 100 తేడా ఎంతలే?" అని నిరాశతో కూడిన నవ్వు నవ్వాడు.
దేవుడికి నైవేద్యంగా నిరాశ.. శాశ్వతంగా ముగిసిన అధ్యాయం
ఆ వచ్చిన రూ. 464 తీసుకొని నేరుగా సమీపంలోని గుడికి వెళ్లాడు. మళ్లీ సివిల్స్ రావాలనో, అదృష్టం కలిసిరావాలనో కోరుకోవడానికి కాదు.. ఆ డబ్బును దేవుడి హుండీలో వేసి ఆ అధ్యాయానికి శాశ్వతంగా స్వస్తి చెప్పడానికి! "ఇక నా జీవితంలో 'నెక్స్ట్ టైమ్' అనేది ఉండదు" అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'రెడ్డిట్' వేదికగా రాసుకొచ్చాడు. "నాపై నీవు చూపించిన దయ కంటే.. నా మనసే చాలా పెద్దది దేవుడా!" అని ఆవేదనతో దేవుడికి సందేశం ఇస్తూ తన సుదీర్ఘ పోస్టును ముగించాడు. ఐదేళ్ల నిద్రలేని రాత్రులు, ఎన్నో ఆశలు, త్యాగాల కల చివరికి 464 రూపాయల వద్ద నిశ్శబ్దంగా ఆగిపోయింది.














Click it and Unblock the Notifications