తాళాలు వేసి మన సైనికులను చంపారు: ఉగ్రదాడిపై తేల్చిన ఎన్ఐఏ
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని యూరీలో పాకిస్థాన్ ఉగ్రవాదులు చేసిన పిరికిపంద చర్యకు సంబంధించిన నీచపు కోణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. దొంగదెబ్బ కొట్టి 20మంది భారత సైనికుల ప్రాణాలు తీసిని ఉగ్రవాద ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
ఎన్ఐఏ దర్యాప్తులో తాజాగా యూరీ ఘటనలో ఉగ్రవాదుల పైశాచికత్వం మరోటి బయటపడింది. ఉగ్రదాడితో టెంట్లో మంటలు రాగానే కొందరు సైనికులు పక్కనే ఉన్న ఆఫీసర్స్ మెస్లోకి , స్టోర్ రూమ్లోకి వెళ్లారని తెలిసింది.
కాగా, ఉగ్రవాదులు మన సైనికులు ఉన్న మెస్కు, స్టోర్ రూమ్కు లాక్ చేశారని దర్యాప్తు తేలింది. దీంతో సైనికులు తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత ముష్కరులు వారిపై తూటాలతో దాడి చేయడంతో కొద్దిసేపటికే జవాన్లంతా ప్రాణాలు కోల్పోయారు.
అయితే ఇదంతా ఉగ్రవాదులు అప్పటికప్పుడు అనుకుని చేసిన పని కాదని, ముందు నుంచే ఈ ప్రాంతంలో పాగా వేసుండొచ్చని ఎన్ఐఏ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఉగ్రవాదులకు ఎవరైనా సహకారం అందించారా? అనే అంశంపైనా ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోంది.
కాగా, నాలుగు కలష్నికవ్ రైఫిల్స్ను ఉగ్రవాదులు ఉపయోగించారని ఎన్ఐఏ తేల్చింది. అంతేగాక, ఉగ్రవాదులు ఉపయోగించిన ఐకామ్ అనే హ్యాండ్సెట్ కూడా పాకిస్థాన్కు చెందిన కంపెనీదేనని స్పష్టమైంది. ఎన్ఐఏ దర్యాప్తులో పాక్ కుట్రలు మరిన్ని బయటపడే అవకాశం ఉంది.