US reacts on Manipur Video: మణిపూర్ వీడియోలు చూసి అమెరికా షాక్- తీవ్ర ఆందోళన..
భారత్ లోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో కుకీలు, మెయిటీలకు మధ్య జరుగుతున్న పోరులో ఇద్దరు మహిళలను వివస్త్రల్ని చేసి రోడ్డుపై నడిపించుకుంటూ వెళ్లి గ్యాంగ్ రేప్ చేసి హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీనిపై ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని విపక్షాలు నిలదీస్తున్నాయి. ఇదే క్రమంలో అమెరికా కూడా దీనిపై స్పందించింది. మణిపూర్ వీడియోలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ అమెరికా ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది.
మణిపూర్లో లైంగిక వేధింపుల కేసులో ఇద్దరు మహిళలు నగ్నంగా ఊరేగింపు జరిపిన వైరల్ వీడియోల నివేదికలపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నగ్నంగా ఉన్న మహిళలను ఒక గుంపు అత్యాచారం చేసి ఊరేగించినట్లు తాజాగా వీడియోలు వెలుగుచూశాయి. గత వారం సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఇది జాతీయ దృష్టితో పాటు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటనపై అరెస్టులు కొనసాగుతున్నా విమర్శలు మాత్రం వెల్లువెత్తుతూనే ఉన్నాయి.

అమెరికాలోని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి ఈ సంఘటనను క్రూరమైనది, భయంకరమైనదిగా అభివర్ణించారు. అలాగే అమెరికా తరఫున బాధితులకు సానుభూతి తెలిపారు. కుకీలకు ఇచ్చిన ఆర్థిక ప్రయోజనాలలో మార్పులపై గిరిజన కుకీ ప్రజలు, మెజారిటీ మెయిటీ మధ్య తీవ్రమైన జాతి ఘర్షణలు తలెత్తడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత వేలాది మంది సైన్యాన్ని అక్కడికి పంపడంతో దాడుల సంఖ్య తగ్గింది. కానీ ఇప్పటికీ చెదురుమదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
మణిపూర్ ఘటనలపై ప్రధాని మోడీ ఇన్నాళ్లు మౌనంగా ఉన్నారు. కానీ తాజాగా మహిళల వీడియో వైరల్ అయ్యాక మాత్రం స్పందించారు. జాతి సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్దితిని ఈ ఘటన కల్పించిందన్నారు. విపక్షాలు మాత్రం ప్రధాని ప్రకటనపై పెదవి విరిచాయి. ఇప్పటివరకూ మణిపూర్ లో పర్యటించకుండా, అక్కడి ప్రభుత్వంపై చర్యలు తీసుకోకుండా కేంద్రం మౌనంగా ఉండటాన్ని ప్రశ్నిస్తున్నాయి. పార్లమెంటులోనూ దీనిపై రగడ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు అమెరికా కూడా దీనిపై స్పందించడంతో కేంద్రం ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications