ఆంక్షలు ఉన్నా..జోరుగా: ముఖ్యమంత్రి ఇంటింటి ప్రచారం
లక్నో: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. క్రమంగా పతాక స్థాయికి చేరుకుంటోంది. నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటంతో.. ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. అందులోనూ దేశ రాజకీయ స్థితిగతులను ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ కూడా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోండటంతో అందరి దృష్టీ దీనిపై పడింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇదివరకే వెలువడింది. ఉత్తర ప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్లల్లో ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఈసీ.
తొలిదశ ఫిబ్రవరి 10వ తేదీన ఆరంభమౌతుంది. చివరి దశ పోలింగ్ మార్చి 7న ఉంటుంది. అదే నెల 10వ తేదీన ఓట్ల లెక్కింపును నిర్వహించేలా షెడ్యూల్ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘ. ఉత్తర ప్రదేశ్లో ఏడు దశల్లో పోలింగ్ ఉంటుంది. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో మొత్తంగా 15,05,82,750 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. దీనికోసం ఎన్నికల అధికారులు 1,74,351 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అధికారం ఎవరిని వరిస్తుందనేది అదే నెల 10వ తేదీన తేటతెల్లమౌతుంది. ఫిబ్రవరి 10వ తేదీన తొలిదశలో 58 స్థానాల్లో పోలింగ్ నిర్వహించడానికి సన్నాహాలను పూర్తి చేశారు. ఈ దశలో పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులను గెలిపించుకోవడానికి బీజేపీ 30 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రస్తుతానికి తొలి దశ వరకు మాత్రమే పరిమితం చేసింది. ఈ తొలి విడత స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రాధా మోహన్ సింగ్, ముఖ్తార్ అబ్బాస్ నక్వీ, స్మృతి ఇరానీ, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకు చోటు లభించింది.
కాగా- యోగి ఆదిత్యనాథ్ తన ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. తొలిదశ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న ఘజియాబాద్లో ఆయన ఈ మధ్యాహ్నం ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. మోహన్ నగర్లో లాంఛనంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్లో పాల్గొన్నారు. వీకే సింగ్ సహా స్థానిక నాయకులు యోగి వెంట ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ ప్రచారం మొదలైంది. ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలను అందజేశారు యోగి ఆదిత్యనాథ్. మరోసారి బీజేపీకే అధికారాన్ని కట్టబెట్టాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు.