Vande Bharat Sleeper:అప్పుడే మొదలైన షాకులు- రిఫండ్, క్యాన్సిలేషన్ ఛార్జీలపై..!
మన దేశంలో అత్యాధునిక ఫీచర్లతో రైల్వేశాఖ అందుబాటులోకి తెచ్చిన వందేభారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ ను ప్రదాని మోడీ తాజాగా పశ్చిమ బెంగాల్లో ప్రారంభించారు. ఈ రైలు ప్రయాణం మొదలై వారం రోజులు కూడా కాలేదు. అప్పుడే రైల్వేశాఖ ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఈ రైలులో ప్రయాణాలు చేసే వారు తమ టికెట్లు రద్దు చేసుకున్నా, రిఫండ్ కోరాల్సి వచ్చినా షాకులు తప్పేలా లేవు.
వందే భారత్ స్లీపర్ టికెట్ల రద్దుకు నిబంధనలు ఖరారు చేస్తూ రైల్వేశాఖ ప్రకటన చేసింది. దీని ప్రకారం వందే భారత్ స్లీపర్ రైళ్లకు సంబంధించిన రీఫండ్ విధానంలో రైల్ భారీ మార్పు చేసింది. చివరి నిమిషంలో తమ కన్ ఫర్మ్ టిక్కెట్లను రద్దు చేసుకునే ప్రయాణీకులు ఇకపై ఛార్జీల వాపసుకు అర్హులు కారు. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణీకుల (టికెట్ రద్దు మరియు ఛార్జీల వాపసు) నియమాలు, 2015కు సవరణను ప్రకటించింది.

రైల్వే బోర్డు ప్రకారం వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ యొక్క కన్ ఫమ్ టికెట్ను ప్రయాణీకుడు లేదా అతని ప్రతినిధి రద్దు కోసం సమర్పించినట్లయితే, ఛార్జీ నుండి రద్దు ఛార్జీలను తగ్గించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని రిఫండ్ చేస్తారు. రైలు షెడ్యూల్ అయిన బయలుదేరే సమయానికి 72 గంటల కంటే ముందు టికెట్ను రద్దు కోసం దరఖాస్తు చేస్తే, ఛార్జీలో 25% మొత్తం కోత పడుతుంది. బయలుదేరే సమయానికి 72 గంటల నుండి 8 గంటల మధ్య రద్దు కోసం టిక్కెట్ను సమర్పిస్తే..రద్దు ఛార్జీ ఛార్జీలో 50% కోత పడుతుంది. రైలు బయలుదేరే సమయానికి 8 గంటల కంటే తక్కువ సమయంలో రద్దు కోసం టిక్కెట్ సమర్పిస్తే.. అస్సలు రిఫండ్ ఉండదు.

అలాగే వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ విషయంలో టికెట్ రద్దు చేయకపోతే లేదా రైలు షెడ్యూల్ బయలుదేరడానికి ఎనిమిది గంటల ముందు వరకు ఆన్లైన్లో టీడీఆర్ దాఖలు చేయకపోతే టిక్కెట్లపై ఛార్జీల వాపసు అనుమతించబోమని పేర్కొంది. మరోవైపు ఇతర రైళ్ల తరహాలో వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ లో ఆర్ఏసీ ఉండదు. టికెట్ కన్ ఫమ్ అయితేనే ప్రయాణాలకు అనుమతిస్తారు. అలాగే మహిళలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ కోటాలు మాత్రమే ఉంటాయి. లోయర్ బెర్తుల్ని సైతం 45 ఏళ్లు దాటిన మహిళలు, 60 ఏళ్లు దాటిన పురుషులకు ఆటోమేటిగ్గా అందుబాటును బట్టి కేటాయిస్తారు.












Click it and Unblock the Notifications