కాశీలో బిర్యానీ తింటే మనోభావాలు దెబ్బతింటాయా?: ఒవైసీ
పవిత్ర కాశీ పుణ్యక్షేత్రంలోని గంగా నది సాక్షిగా సాగిన ఓ ఇఫ్తార్ విందు ఇప్పుడు రాజకీయ రణరంగానికి వేదికైంది. గంగా నదిలో పడవపై ప్రయాణిస్తూ చికెన్ బిర్యానీ తిని, ఎముకలను, వ్యర్థాలను నదిలోకి విసిరేశారనే ఆరోపణలతో పోలీసులు 14 మంది ముస్లిం యువకులను అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, మత మనోభావాలను దెబ్బతీశారనే ఫిర్యాదు మేరకు కోత్వాలి పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.
ఈ అరెస్టులపై ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం నదిలో ఆహారం తిన్నంత మాత్రాన మత మనోభావాలు ఎలా దెబ్బతింటాయని ఆయన ప్రశ్నించారు. "నదిలోకి వదిలేస్తున్న మురుగునీరు మీకు బాధ కలిగించడం లేదా? యువకులు ముస్లింలు కావడమే వారు చేసిన నేరమా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజాన్ మాసంలో మద్యం దుకాణాలు తెరిచి ఉంచడం వల్ల తన మత మనోభావాలు దెబ్బతినవా అని వారణాసి అధికారులను నిలదీశారు. ఈ అరెస్టులు పూర్తిగా వివక్షతో కూడుకున్నవని ఆయన ఆరోపించారు.

ఫిర్యాదు వెనుక సనాతన ధర్మం!
బీజేపీ యువమోర్చా నగర యూనిట్ అధిపతి రజత్ జైస్వాల్ ఇచ్చిన ఫిర్యాదుతోనే ఈ వివాదం మొదలైంది. గంగా నది సనాతన ధర్మం పాటించే కోట్లాది మందికి అత్యంత పవిత్రమైనదని, అటువంటి చోట మాంసాహారం భుజించి, వ్యర్థాలను నదిలో పారవేయడం భక్తుల విశ్వాసాలను అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడ్డారని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు.
అయోమయంలో కాశీ భక్తులు
కాశీలో గంగాజలంతో పూజలు చేసే భక్తులు ఈ ఘటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు ఈ అరెస్టులు రాజ్యాంగ విరుద్ధమని ఒవైసీ వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ 14 మంది యువకులు జైలులో ఉండగా, పోలీసులు ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. పవిత్ర స్థలాల వద్ద పాటించాల్సిన నియమాలు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ మధ్య జరుగుతున్న ఈ పోరాటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది












Click it and Unblock the Notifications