ఉపరాష్ట్రపతి ఎన్నికలు 2022 పోలింగ్ ప్రారంభం-ఓటేసిన ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు..
భారత తదుపరి ఉపరాష్ట్రపతిని నిర్ణయించేందుకు జరుగుతున్న ఎన్నికల్లో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటువేస్తున్నారు. ఎన్డిఎ అభ్యర్థి జగదీప్ ధన్ఖర్ ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధి మార్గరెట్ అల్వాపై పోటీ పడుతున్నారు. ఎన్డీయేకు అనుకూలంగా సంఖ్యాబలం ఉండడంతో పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ ధంఖర్ సులభంగా విజయం సాధించబోతున్నారు. అల్వా పేరును నిర్ణయించేటప్పుడు తమను సంప్రదించలేదని ఆరోపిస్తూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో మిగతా ప్రతిపక్ష ఎంపీలు మాత్రం ఓటేస్తున్నారు.
ప్రధాని మోడీ తొలి ఓటు వేసి ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభించారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు ఓటు వేశారు. విపక్ష నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీల్ చైర్ లోనే పార్లమెంటుకు వచ్చి ఓటు వేశారు.

హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, వాణిజ్య మంత్రి, రాజ్యసభలో సభాపక్ష నేత పీయూష్ గోయల్ కలిసి ఓటు వేయడానికి వచ్చారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, బీజేపీ చీఫ్ విప్ రాకేష్ సింగ్, తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు, వైసీపీ రెబెల్ ఎంపీ రఘు రామకృష్ణంరాజు ఓటు ఇప్పటివరకు ఓటు వేసిన వారిలో ఉన్నారు.

పోలింగ్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఆ తర్వాత వెంటనే ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇవాళ సాయంత్రంలోగా రిటర్నింగ్ అధికారి తదుపరి ఉపరాష్ట్రపతి పేరును ప్రకటిస్తారు. నామినేటెడ్ సభ్యులతో సహా లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగుస్తుంది.












Click it and Unblock the Notifications