విజయ్ మాల్యా ఆర్థిక నేరస్తుడే...ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు: ముంబై ప్రత్యేక కోర్టు
బ్యాంకులకు వేల కోట్లు రుణాలు ఎగవేసి లండన్లో తలదాచుకుంటున్న లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాను ముంబై ప్రత్యేక కోర్టు పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది. తన ఆస్తులను అన్నిటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని ఆర్డర్ పాస్ చేసింది. కోర్టు ఇచ్చిన ఆర్డర్ పై స్టే ఇవ్వాలని తను అప్పీలు చేసుకునేందుకు మరింత సమయం ఇవ్వాలన్న మాల్యా అభ్యర్థనను కోర్టు తోసి పుచ్చింది. కేసు విచారణను 5 ఫిబ్రవరికి వాయిదా వేసింది.
కోర్టు ఇచ్చిన ఆర్డర్తో ఆర్థిక నేరగాళ్లకోసం కొత్తగా తీసుకొచ్చిన చట్టంలో తొలి ఆర్తిక నేరస్తుడిగా విజయ్ మాల్యా నిలిచాడు. ఆర్థిక నేరగాళ్ల కోసం కొత్త చట్టాన్ని ప్రభుత్వం గతేడాది ఆగష్టులో తీసుకొచ్చింది. ముంబైలోని ప్రత్యేక కోర్టులో విజయ్ మాల్యాను ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించాలని ఆయన కేసులను విచారణ చేస్తున్న ఈడీ అప్లికేషన్ దాఖలు చేసింది. కేసును విచారణ చేసిన ప్రత్యేక కోర్టు ఈడీ పెట్టిన అప్లికేషన్కు అనుకూలంగా విజయ్ మాల్యాను పారిపోయిన ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం కోర్టులో మాల్యా కేసు విచారణకు వచ్చింది. మాల్యాను ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించి అతని ఆస్తులను స్వాధీనం చేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఈడీ న్యాయస్థానాన్ని కోరింది. ప్రస్తుతం లండన్లో ఉన్న విజయ్ మాల్యాను భారత్కు తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా వెస్ట్మిన్స్టర్ మెజిస్ట్రేట్ కోర్టు డిసెంబరులో బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ వచ్చే వరకు మాల్యా బెయిల్పైనే తిరిగే అవకాశం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా పలు బ్యాంకుల వద్ద రుణాలు తీసుకొని వాటిని తిరిగి చెల్లించకుండా యూకేకు 2016లో మాల్యా పారిపోయారు. దీనిపై అభియోగాలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయన్ను భారత్కు తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.