తీహార్ జైలా..మసాజ్ సెంటరా - బీజేపీ చేతికి బ్రహ్మాస్త్రం
న్యూఢిల్లీ: ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీపై రాజకీయపరమైన దాడులు తీవ్రతరం అయ్యాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా పాల్గొంటోన్న ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు తాజాగా భారతీయ జనతా పార్టీ నాయకులకు టార్గెట్ అయ్యారు. దీనికి కారణం లేకపోలేదు. ఆయన మంత్రివర్గ సహచరుడు, తీహార్ జైలులో ఉన్న మంత్రి సత్యేంద్ర జైన్ వ్యవహారమే.
మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉంటోన్నారు. హవాలా రాకెట్, మనీ లాండరింగ్కు పాల్పడ్డారనే కారణంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనను మే 30వ తేదీన అరెస్ట్ చేశారు. 2017 ఆగస్టు 24వ తేదీన ఆయనపై మనీ లాండరింగ్ కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. బెయిల్ కోసం సత్యేంద్ర జైన్ చేయని ప్రయత్నాలంటూ లేవు. తాజాగా ఈ నెల 17వ తేదీన కూడా ఆయన పెట్టుకున్న బెయిల్ పిటీషన్ను ఢిల్లీ న్యాయస్థానం కొట్టివేసింది.
ఈ పరిణామాల మధ్య సత్యేంద్ర జైన్.. ఇప్పుడు తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. తీహార్ జైలులో ఆయనకు కొందరు సిబ్బంది మసాజ్ చేయడానికి సంబంధించిన సీసీటీవీకి సంబంధించిన వీడియో ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సత్యేంద్ర జైన్ ఉదంతాన్ని చాటి చెప్పింది. తీహార్ జైలును మసాజ్ సెంటర్గా మార్చుకున్నారనే ఆరోపణలు అప్పుడే వ్యక్తమౌతోన్నాయి కూడా.
#WATCH | CCTV video emerges of jailed Delhi minister and AAP leader Satyendar Jain getting a massage inside Tihar jail. pic.twitter.com/MnmigOppnd
— ANI (@ANI) November 19, 2022
తీహార్ జైలులో సత్యేంద్ర జైన్ రాజభోగాన్ని అనుభవిస్తోన్నాడంటూ ఇదివరకే భారతీయ జనతా పార్టీ నాయకులు పలుమార్లు విమర్శించారు గానీ.. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలనేవీ బయట పెట్టలేకపోయారు. ఇప్పుడు వారికి ఈ వీడియో రూపంలో బ్రహ్మాస్త్రం దొరికినట్టయింది. శిక్షకు బదులుగా రాజభోగాలను ఆయన అనుభవిస్తోన్నాడంటూ మండిపడుతున్నారు బీజేపీ నాయకులు. కేజ్రీవాల్ ప్రభుత్వమే దగ్గరుండి ఆయనకు వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తోందంటూ మండిపడుతున్నారు.
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఈ వీడియోపై ఆమ్ ఆద్మీ పార్టీ వివరణ ఇచ్చుకుంటోంది. అధికారికంగానే సత్యేంద్ర జైన్ అనుమతులు తీసుకున్నారని చెబుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ వెసలుబాటును అధికారులు కల్పించారని వివరణ ఇస్తోంది. ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్కు అనుమతి ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు తెలిపారు. వయస్సు, ఆరోగ్య కారణాల వల్ల ఈ అనుమతి ఉందని స్పష్టం చేస్తోన్నారు.
టాప్ మోడల్పై గ్యాంగ్ రేప్ - కారులో: మహిళ సహా నలుగురు..!!